ఒక వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు పెట్టింది. దానిపై సంబంధం లేని… తమ రాజకీయ కక్ష తీర్చుకోవాలనుకున్న వారందరి పేర్లూ చేర్చేస్తోంది. ఇలాంటి కేసులతో మన దేశంలో వ్యవస్థలు అత్యంత బలహీనం అని నిరూపించడమే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తున్నది.
ఇప్పటికే అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా బెయిల్ పై ఉండి రికార్డు సృష్టించిన జగన్ రెడ్డి, మర్డర్ కేసు లోని నిందితులను కూడా ఎంతో సులువుగా తప్పించేస్తున్నారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే…. కళ్ల ముందు కనిపించే స్కిల్ సెంటర్లు లేవని కేసులు పెట్టి నమ్మించేస్తున్నారు ! స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజ్యాంగానికి.. చట్టాలకు.. న్యాయాలకు ఎలా కళ్లకు గంతలు కట్టారో కళ్ల ముందే ఉంది. అయినా వ్యవస్థల్ని కళ్లు తెరవనీయకుండా చేశారు.
రాజ్యాంగం ప్రకారం పాలసీ మ్యాటర్స్ లో ముఖ్యమంత్రికి అధికారం ఉంది. కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఐడీకి లేదు. కానీ ఈ రాజ్యాంగం … తన చేతుల్లో చెల్లుబాటు కాదని నిరూపించారు. ఎదురుగా ఉన్న స్కిల్ సెంటర్లు లేవని… కేంద్రం నుంచి వచ్చిన.. తామే ఇచ్చిన సర్టిఫికెట్లన్ని దాచేసి కేసులు పెట్టారు. డబ్బులు మళ్లించారని .. ఒక్క ఆధారం లేకుండా వాదిస్తున్నారు.
పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేసి తనకు న్యాయం కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. లేని రింగ్ రోడ్ మీద కేసులు కూడా ఇవే కోవకు చెందినవి. రింగ్ రోడ్ అనేదే లేదు. కేవలం ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఆ ప్రతిపాదనల వల్ల చాలా మందికి మేలు జరిగిందని కేసులు పెట్టేశారు. తన వారికి లబ్ది చేకూర్చారని ఫిర్యాదు … అదీ ఓ ఎమ్మెల్యే…. అదీ కూడా తమ పార్టీకి చెందిన వాడే.
ఈ కేసుల వెనుక రాజకీయ కక్ష సాధింపులు ప్రాథమిక లక్ష్యం అయి ఉండవచ్చు కానీ.. ఇలాంటి కేసులు పెట్టడం వెనుక మాత్రం ఖచ్చితంగా మన వ్యవస్థలు ఎంత బలహీనమో చెప్పేందుకు జగన్ రెడ్డి క్రిమినల్ బుర్రను వాడుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలు బలమైనవే కానీ వాటిని నడిపించేది కూడా మనుషులేనని… ఆయన నిరూపిస్తున్నారు. ఇది ఓ రకంగా దేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని అవహేళన చేయడమే.
ఇలాంటి కేసులు ఆదర్శమయితే దేశం అల్లకల్లోలమే అవుతుంది. స్కిల్ లాంటి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగలిగితే… జగన్ రెడ్డి లాంటి వాళ్లను పదవి పోయిన తర్వాత ప్రతీ రోజూ జైల్లో ఉంచవచ్చు. జగన్ రెడ్డి అనే కాదు… ముఖ్యమంత్రిగానే కాదు.. ఎవరిపైన అయినా .. సన్నిహితులు.. లబ్ది పేర్లతో కథలు చెప్పి కేసులు పెట్టేయవచ్చు. ఏ ఆధారం లేకపోయినా సరే. ఇన్నర్ రింగ్ రోడ్డు లాంటి కేసులు అయితే.. గాల్లో ఊహించేసుకోవచ్చు.
ముందు ముందు ఇలా కూడా కేసులు పెట్టవచ్చా అనేలా జగన్ ప్రభుత్వం కేసులు పెడుతున్నది. ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయడం, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోకుండా చేయడం…. ఇలా…. అన్నీ కుట్రలే… ఇవన్నీ వ్యవస్థల డొల్లతనాన్నిప్రజల ముందు ఉంచబోతున్నాయి.
ఈ కుట్రలు ఫలిస్తే సీఎం జగన్ ఆలోచనకు మరింత వేగంగా పని చెబుతారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు గురి పెట్టినట్లే ఆ తర్వాత తన మాట వినని అధికారులపై కూడా ఇదే పని చేస్తారు…. తస్మాత్ జాగ్రత్త…