బాబుపై అక్రమ కేసులతో జగన్కి శిక్ష..?? మొత్తం సీన్ రివర్స్..!!
ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తనకు 150 ఎమ్మెల్యేల బలం ఉందని ఇన్నాళ్లు విర్రవీగిన జగన్ కు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ఆఖరికి జగన్ కు అత్యంత నమ్మకస్తులు కూడా పార్టీ వీడుతుండడం సీఎంను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఎనలేని బలాన్ని ఇచ్చారని, ఇక తమకు తిరుగులేదని అతి విశ్వాసంతో ఇన్నాళ్లు జగన్ వ్యవహరించారు. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా ఇక తమదే రాజ్యం అన్నట్లుగా, కనీసం మరో పదేళ్లు వైసీపీదే అధికారం అనే అతి విశ్వాసంతో ఉండేవారు. ఎందుకంటే ఆ మధ్య జగన్ పార్టీ నాయకుల సమావేశంలో వై నాట్ 175 అంటూ పార్టీ నేతలకు విశ్వాసాన్ని నూరి పోశారు. వారు కూడా జగనన్న తమ వెంట ఉన్నంత వరకూ అదేం పెద్ద కష్టం కాదని.. రొమ్ము విరుచుకొని మరీ వ్యాఖ్యలు చేశారు. కానీ, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీన్ మొత్తం రివర్స్ అయిపోతోంది.
ఇందుకు జగన్ చేసిన తప్పిదాలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బటన్లు నొక్కి లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి వివిధ పథకాల పేరుతో డబ్బులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. పూర్తిగా సంక్షేమంపైనే ఫోకస్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ, సంపద పెంచకుండా అప్పులు తెచ్చి మరీ పంచి పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ మెంట్ అనేది మరుగున పడిపోయింది. ప్రజలకు కనీస అవసరాలైన రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. ఎక్కువ మంది కొనుగోలు చేసే మద్యం విషయంలోనూ చెప్పలేనన్ని లోపాలు ఉన్నాయి. అతి పెద్ద తప్పిదం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించి జైలులో పెట్టించడం. ఆ కేసులో బలం లేకపోవడంతో.. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు అంటూ ఏపీ సీఐడీని వాడుకొని వరుసగా అక్రమ కేసులు బనాయించారు.
ఆ అన్ని కేసులూ బలహీనమైనవే. అతి బలవంతం మీద కోర్టులో బెయిల్ రాకుండా కొన్ని రోజులు చేయగలిగినప్పటికీ అవి నిలిచే పరిస్థితి లేదు. సీఐడీ అధికారులు మీడియా ముందు చేసే వ్యాఖ్యలకి, కోర్టులో ధర్మాసనం ముందు చెప్పే మాటలకి పొంతన లేకపోవడాన్ని కూడా ప్రజలు సులభంగానే గమనించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కక్ష్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రజలు గ్రహించారు. అప్పటి నుంచి మరింత వేగంగా జగన్ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. అసలే జగన్ పాలన పట్ల విముఖతతో ఉన్న ప్రజలు.. చంద్రబాబును ఇబ్బంది పెట్టేసరికి సీఎంపై మరింత విరక్తి పెంచుకున్నారు. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా గ్రహించారు.
జగన్ కక్ష్య సాధింపు కోసం చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ కేసులు బూమరాంగ్ తరహాలో వచ్చి మళ్లీ జగన్ కు తగిలాయి. దీంతో అధిష్ఠానం నమ్మిన వై నాట్ 175 అనేది మర్చిపోయింది. కనీసం గెలిస్తే చాలనే స్థాయికి దిగజారింది. తాజాగా ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేస్తుండడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో పార్టీ అధిష్ఠానం టికెట్లు నిరాకరిస్తుందని తెలుసుకొని మరికొంత మంది తమ దారి తాము చూసుకుంటున్నారు.











