వైఎస్ షర్మిల తన అన్న జగన్ పై రోజురోజుకూ విమర్శల డోసు పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా తనపై నెగటివ్ కథనాలు ప్రచురిస్తున్న సాక్షిపైన కూడా షర్మిల ఆరోపణలు చేశారు. ఆ క్రమంలోనే సాక్షిలో తనకు కూడా వాటా ఉందని.. అలాంటిది తనపైనే తప్పుడు వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. సాక్షిలో తనకు కూడా వాటా అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే నిర్ణయించారని తెలిపారు. అలాంటిది మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా.. అంటూ ప్రశ్నించారు. మరోవైపు తాను వైఎస్ పేరు పెట్టుకోవద్దని తన భర్త ఇంటి పేరు.. మొరుసుమల్లి అని ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డనని.. తన పేరు వైఎస్ షర్మిలా రెడ్డి అని మరోసారి ఆమె తేల్చి చెప్పేశారు.
తెలంగాణలో తనతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుందని.. తనపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారన్నారు షర్మిల. ఆమె చేసిన వ్యాఖ్యల ప్రకారం.. సాక్షిలో సగం వాటా అంటే.. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ ఉంటుంది. 2008లో సాక్షి పత్రిక జగతి పబ్లికేషన్స్ పేరుతో.. ఆ మరుసటి ఏడాది సాక్షి టీవీ ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తో పేరుతో ప్రారంభించారు. ఛైర్మన్గా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల్లో భాగంగా.. సీబీఐ ఛార్జిషీట్ ప్రకారం.. ఈ మీడియా సంస్థలలో పెట్టుబడులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని ఉంది. తండ్రి సీఎంగా ఉన్న సమయంలో లబ్ధి పొందిన వ్యక్తుల నుంచి వచ్చిన లంచాల ద్వారా, ఇంకా వారి నుంచే బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంస్థను తమ రాజకీయ ప్రయోజనాల కోసం మొదలుపెట్టారు. వైసీపీ స్థాపించాక ఇది పూర్తిగా.. ఆ పార్టీ కరపత్రికలా మారిపోయిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ పత్రిక, టీవీకి జగన్ మోహన్ రెడ్డే ఛైర్మన్ గా వ్యవహరించేవారు. తర్వాత జగన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఇప్పుడు వైఎస్ భారతి రెడ్డి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జగన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి అధ్యక్షతనే సంస్థ నడుస్తోంది. కీలక విషయాల్లో, కొన్ని రకాల వార్తల విషయంలో భారతి రెడ్డే జోక్యం చేసుకుంటూ వస్తున్నారు.
అంతకుముందు సాక్షి పరిస్థితి ఎలా ఉన్నా.. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాక్షి విపరీతమైన లాభాల్లో నడుస్తోంది. సాక్షి పెట్టిన కొత్తలో 2009-12 మధ్య సాక్షి టీవీలో ప్రకటనల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసిన దాదాపు రూ.40 కోట్లలో ఒక్క సాక్షి టీవీకే రూ.17 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలు వచ్చినట్లు లెక్కలు ఉన్నాయి. ఇక పేపర్ కు వచ్చిన ప్రభుత్వ యాడ్స్ లెక్కేలేదు. అందులో భాగంగానే జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన 2019 నుంచి సాక్షికి ప్రభుత్వ యాడ్స్ పంట పండుతూ వస్తోంది. సాక్షి పత్రికలను వాలంటీర్లతో బలవంతంగా కొనిపించడం.. ఆ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుండడంతో.. సర్క్యులేషన్ కూడా విపరీతంగా పెరిగి ఆదాయంకూడా భారీగా అయింది.
ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన ప్రకారం.. షర్మిలకు కూడా సాక్షిలో వాటా ఉంది కాబట్టి.. సంస్థ నుంచి వస్తున్న లాభాలు ఇన్నాళ్లు షర్మిలకు అందుతూ వచ్చినట్లు తెలిసింది. కానీ, ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రత్యక్ష యుద్ధంతో ఈసారి షర్మిలకు లాభాలను భారతి రెడ్డి అందిస్తారా అనేదానిపై ఆసక్తి నెలకొంది.