(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభించిన జలకళ ఆచరణలో ప్రభుత్వం విఫలమైంది. ఆశతో ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకున్న దరఖాస్తుదారులకు నిరాశే ఎదురవుతోంది. విజయనగరం జిల్లాలో ఒక్కచోట కూడా ఈ పథకం కింద నేటివరకూ ఒక్క బోరు కూడా పడలేదు. దీంతో ఆశగా ఎదురుచూసిన రైతులు నిరాశతో శాపనార్థాలు పెడుతున్నారు.
29వేల దరఖాస్తులు
విజయనగరం జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది రిగ్గులను మంజూరు చేశారు. పథకం కోసం సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు నిబంధనల ప్రకారం జిల్లావ్యాప్తంగా రెండున్నర ఎకరాల భూమి ఉన్న 29 వేల మంది రైతులు ‘జలకళ’ కింద బోర్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. రిగ్గుల యాజమాన్యానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన అగ్రిమెంటు ఇవ్వకపో వడంతో ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
త్వరలోనే అగ్రిమెంట్లు
జలకళకు సంబంధించి రిగ్గుల విషయమై త్వరలోనే అగ్రిమెంట్లు జరుగుతాయని, ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి కానుందని విజయనగరం డ్వామా పీడీ నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 29 వేల మందికి కూడా బోర్లు మంజూరు చేస్తామన్నారు. ఇంకెవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Also Read: బాలుకు నివాళి : విజయనగరంతో ఎనలేని అనుబంధం