కరోనా విలయతాండవం చేస్తున్న వేళ సామాజిక దూరానికి మంగళం పాడి కనీసం మాస్క్ కూడా ధరించకుండా బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో జనాన్ని వెనుకేసుకుని ఊరేగడాన్ని చూస్తున్న జనం విస్తుపోతున్నారు. వీరికి నిబంధనలు వర్తించవా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ..
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్రకు శుక్రవారం నాటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ వారు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగా విజయనగరం జిల్లాలోనూ ర్యాలీలు నిర్వహించారు. అయితే కరోనా ఇంకా పట్టి పీడిస్తున్న తరుణంలో వేలాదిమంది గుంపుగా ఒకరికొకరు భుజాలు కలుపుకుంటూ ర్యాలీలు నిర్వహించడం విమర్శలకు దారితీస్తోంది.
కరోనా గుర్తులేదా..?
కరోనా ఉందని స్థానిక ఎన్నికలను వ్యతిరేకిస్తున్న నాయకులు వేలాదిమంది కలిసిమెలిసి తిరగడమేంటని, ఇప్పుడు కరోనా గుర్తు లేదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలపై ఆంక్షలు ఉన్న తరుణంలో ప్రభుత్వ ప్రతినిధుల నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సబబు అని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిషేధపుటాజ్ఞలు అమలు చేయాల్సిన పోలీసులు ఎక్కడని? ఎద్దేవా చేస్తున్నారు. ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే.











