ఏపీలోని ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి సదరు ఆలయాలను సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే పరిస్థితి ఉందని, ఈనెల 14తో ధనుర్మాస దీక్ష పూర్తవుతుందని.. 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ధ్వంసమైన ఆలయాల సందర్శనకు యాత్ర చేపడతామని వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలయాల ఉనికికే భంగం కలిగే స్థితి వచ్చినపుడు మౌనంగా ఉండకూడదనే తాము బయటకు వస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని పేర్కొన్నారు. వ్యక్తులు, సమాజం సహనాన్ని పరీక్షించడానికీ ఓ హద్దు ఉంటుందని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉన్నా..ఏపీలో చినజీయర్ స్వామి యాత్ర మొదలైతే రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితి కనిపిస్తోంది.
వారికి కావాల్సిన వ్యక్తిగా..
చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక గురువుగా అందరికీ తెలుసు. ఆయనకు బీజేపీ పెద్దలతోనూ, కేసీఆర్తోనూ సత్సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు కేసీఆర్ స్వయంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి ఆశీస్సులు పొందారు. బీజేపీలో కీలకంగా ఉన్న వ్యక్తులతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయని ప్రచారంలో ఉంది. ఇక కేసీఆర్ రెండోసారి తెలంగాణ సీఎం అయ్యేందుకు చినజీయర్ ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం చినజీయర్కు పెద్దగా సత్సంబధాలు లేవు. ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు కలిసినట్లు గతంలో ప్రచారం జరిగినా.. వైసీపీ నేతలు, ఏపీ సీఎం జగన్, .విశాఖ శారదాపీఠం, స్వరూపానందేంద్ర స్వామికి కావాల్సిన వ్యక్తులుగా పేరుంది. తెలంగాణ సీఎం కేసీఆర్కి కూడా విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామితో సత్సంబంధాలున్నా.. ఏక కాలంలో ఇద్దరు స్వాముల ఆశీస్సులూ పొందగలిగారు. ఇద్దరు స్వాములకు సేవా కార్యక్రమాలకు గాను భూములూ కేటాయించారు. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి యాత్ర ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ మొదలైంది.

వైసీపీలో టెన్షన్ అదే..
ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ సర్కారు క్షేత్రస్థాయిలో కొన్ని విమర్శలను ఎదుర్కొంటోందనేది వాస్తవం. ఈ సమయంలో చినజీయర్ స్వామి సదరు ఆలయాలను సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. వైసీపీ ప్రతి విమర్శలు చేయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులైతే.. వైసీపీ మరో ప్రశ్నకు తావివ్వకుండా అదే పని చేసేది. అయితే రాజకీయ నాయకులపై చేసినంత ఈజీగా, చౌకబారుగా చినజీయర్ స్వామిపై ప్రతి విమర్శలు చేస్తే.. మరింత అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది. అంతేకాదు.. మాట తీరులోనూ, ప్రాధాన్యం విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. చినజీయర్ స్వామి దూరం పెడతారని ఇప్పటికే రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కొన్నాళ్ల క్రితం ఇదే జరిగిందని, ఆయన ఆశీస్సులు మళ్లీ పొందేందుకు ప్రభుత్వ పెద్దలు దాదాపు రెండేళ్లపాటు ప్రయత్నించాల్సి వచ్చిందని అప్పట్లో చర్చ జరిగింది. ఓ పారిశ్రామిక వేత్త జరుపుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా మళ్లీ కలిశారని అప్పట్లోనే చర్చ జరిగింది. అంటే.. ఏ మాత్రం హర్ట్ చేసినా..చినజీయర్ స్వామి కన్నెర్ర జేసే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చినజీయర్ యాత్ర పరోక్షంగా ప్రతిపక్షాలకు ముఖ్యంగా బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉందని, రానున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలపై ప్రభావం పడితే నష్టపోతామనే టెన్షన్ వైసీపీలో మొదలైందని చెబుతున్నారు.
బండి సంజయ్ కామెంట్లపై మల్లగుల్లాలు..
చినజీయర్ స్వామి ఏపీలో యాత్ర చేపడతానని చెప్పే ముందురోజే..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు వైసీపీ సర్కారుపై సంచలన కామెంట్లు చేశారు. బైబిల్, భగవద్గీతలను తెరపైకి తెచ్చారు. తిరుమల విషయంలో వైసీపీని ఉద్దేశించి రెండు కొండలు అనేవారికి ఓటేస్తారా.. ఏడు కొండలు అని చెప్పే బీజేపీకి ఓటేస్తారా అని వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ మంత్రులు కౌంటర్ ఇచ్చే యత్నం చేసినా.. సోషల్ మీడియాలో బండి సంజయ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ విషయంలో మింగలేక, కక్కలేక ఉన్న వైసీపీకి..చిన జీయర్ యాత్ర పరీక్షగా మారనుంది. రాజకీయాలకు, చినజీయర్ స్వామి యాత్రకు డైరక్ట్గా సంబంధం లేకున్నా.. ప్రస్తుతం ఆలయాల రక్షణ, హిందూ మత విశ్వాలను కాపాడే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే కోణంలో క్షేత్రస్థాయిలో మెస్సేజ్ వెళ్తే.. పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
పోటీ యాత్ర ఉంటుందా..
ఇక చినజీయర్ స్వామి యాత్ర నేపథ్యంలో.. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతోనో..లేక వేరే ఆధ్యాత్మిక వ్యక్తుల ప్రోత్సాహంతోనో మరో యాత్ర మొదలైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదనే చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాల (ఇటీవల పెద్దగా లేవని ప్రచారంలో ఉంది)లను బట్టి.. విమర్శలు తగ్గించే యత్నం జరుగుతుందా అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తం మీద ఏది జరిగినా చినజీయర్ స్వామి యాత్ర ద్వారా ఏపీలో రాజకీయం మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి











