మహానటుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ పై విడుదల చేసిన పుస్తకాలపై ఏర్పాటుచేసిన సమాలోచన సభలో ఈ విషయాన్ని ప్రకటించారు.పలువురు ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు.
తెలుగు జాతికి గుర్తింపు, గౌరవనాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు నాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్.టి.ఆర్. శతాబ్ది సందర్భంగా ఎన్.టి.ఆర్. శాసన సభ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్. చారిత్రక ప్రసంగాలతోపాటు శకపురుషుడు ప్రత్యేక సంచికపై సమాలోచను ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఆదివారం నిర్వహించింది. ఈ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఎన్.టి.ఆర్. సినిమా, రాజకీయ జీవితంపై వెలువరించిన శకపురుషుడు ఆయన ప్రసంగాల పుస్తకాలను ఈ తరం తప్పకుండా చదవి స్ఫూర్తి పొందాలని సూచించారు.
లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారని, ముఖ్యమంత్రిగా అలాంటి వారు ప్రపంచంలోనే గొప్ప అరుదుగా ఉంటారని ఆయన అన్నారు. ఆయన ఏది అనుకుంటే అది సాదించిన దాకా నిద్రపోరని 40 సంవత్సరాల క్రితమే ప్రతిపక్షాలను ఐఖ్యం చేసిన ఘనత ఎన్.టి.ఆర్.ది అని చెప్పారు. కమిటీ వెలువరించిన ఈ మూడు గ్రంథాలు ఎన్.టి.ఆర్. వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేస్తాయని ఈ గ్రంథాలు ప్రజలందరికి చేరాలని తాను కోరుకుంటున్నాని ఆయన చెప్పారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు దైవంతో సమానమని, ఆయనతో పనిచేసే అవకాశం అదృష్టం కలిగాయని ఆయన శతాబ్ది సందర్భంగా కమిటీ వెలువరించిన మూడు గ్రంథాలలో శకపురుషుడు అత్యున్నతమైనది అలాంటి గ్రంథాన్ని ఈ తరం పాఠకులకు అందించినందుకు కమిటీని అభినందిస్తున్నాని శకపురుషుడు ప్రతి ఇంటిలో ఉండదగ్గ పుస్తకమని ఆయన చెప్పారు.
సుమన్ మాట్లాడుతూ ఆయనతో నటించే అవకాశం కలగక పోయినా ఆయనను మూడు సార్లు కలిశామని, ఆయన ఎంతో ఆప్యాయంగా తనను ఆదరించి, మాట్లాడటం జీవితంలో మరచిపోలేనని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రదకం ప్రవేశించినప్పుడు స్ఫూర్తి పొంది విరాళంగా లక్ష రూపాయలను ఇచ్చిన ఆనందం తనకు ముధుర స్మృతిగా మిగిలిపోయిందని అన్నారు.
దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. ను దూరంగా చూస్తేనే జీవితం ధన్యమైపోతుందనుకున్న రోజులున్నాయని అలాంటిది అడవి రాముడు సినిమా షూటింగ్ అప్పుడు ఆయన పక్కనే నిలబడి క్లాప్ కొట్టే అవకాశం వచ్చినప్పుడు జీవితంలో ఇంతకంటే ఈ తృప్తి, ఈ ఆనందం చాలు అని అనుకున్నానని ఆయన నిజంగా దైవాంశ సంభూతుడని అన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ‘నాన్నగారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరగటం తమకుటుంబానికి ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలగజేశాయని, అన్న బాలకృష్ణ, నా వివాహం తిరుపతిలో జరిగినప్పుడు నాన్నగారు స్వయంగా రాలేదని బాదపడ్డా ఆయన ప్రజలకోసం ప్రచారంలో ఉన్నాడని తెలిసి గర్వపడ్డా’మని చెప్పారు. నాన్నగారి కృషి, పట్టుదల మాకు వారసత్వంగా వచ్చాయని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
కమిటీ చైర్మన్ టి.డి. జనార్ధన్ మాట్లాడుతూ అన్నగారి శతాబ్ది సంవత్సరంలో వారికి నివాళిగా ఏదైనా చేయాలనే సంకల్పంతో ఒక కమిటీగా ఏర్పాటయ్యామని, అన్నగారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు పుస్తకాలు తీసుకు రావటానికి ఎనిమిది నెలలు అవిశ్రాంతంగా శ్రమించామని కమిటీ సభ్యులంతా నిబద్ధతతో పనిచేశారని ఇప్పుడు ఆ పుస్తకాలను అందరూ ప్రసంసిస్తుంటే తమకెంతో సంతోషంగాను, సంతృప్తిగాను ఉందని జనార్థన్ తెలిపారు.
అన్నగారి వంద అడుగుల విగ్రహాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టించాలనే సంకల్పంతో ఈ కమిటీ పనిచేస్తుందని ఈ కమిటీని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. ఈ సభలో కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, దొప్పలపూడి రామ్ మోహన రావు, డి. మధుసూదన రాజు, మండవ సతీష్, శ్రీపతి సతీష్, కాట్రగడ్డ ప్రసాద్, విక్రమ్ పూల తదితరులు పాల్గొన్నారు. ఈ సభను సీనియర్ జర్నలిస్ట్, కమిటీ సభ్యుడు భగీరథ సమర్థంగా నిర్వహించారు.