సినిమాల్లో ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అనే డైలాగు పలికిన రజినీకాంత్ జనం ముందు వందల ప్రశ్నలను మిగిల్చారు.
రజినీ అంటే చీకటి అనే అర్థముంది.. సినిమాల్లో ఆయన కాంతులు వెదజల్లినా జీవితంలో మాత్రం ఆయన ఎవరికీ అర్థం కారు అని మరోసారి నిరూపించారు. తన రాజకీయ జీవితానికి ఆయన ఎండ్ కార్డు పడేయటం ఆయనకు ఎంత లాభకరమోగానీ ఆయన మీదే ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీకి మాత్రం పెద్ద నష్టమేననాలి. ముఖ్యంగా భాజపా దృష్టంతా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల మీదే ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై భాజపా దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు బాగా దగ్గరైంది. ఇక మిగిలింది తమిళనాడు, నవ్యాంధ్ర ప్రదేశ్. అక్కడ పావులు కదపాలంటే ఎవరో ఒకరు స్టార్ డమ్ ఉన్న నటులు అవసరం.
ఏపీ విషయానికి వస్తే అంతో ఇంతో పవన్ కళ్యాణ్ భాజపాకు దగ్గరగానే ఉన్నారు. ఇక తమిళనాడులో భాజపా పాగా వేయడం అంత సులువైన విషయం కాదు. ప్రత్యక్షంగా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినా పరోక్షంగా పావులు కదుపుతూ వచ్చింది. అందులో భాగంగానే అన్నాడీఎంకే శశికళకు భాజపా అండదండలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. రజినీ రాజకీయ అరంగేట్రం వెనక భాజపా ఉందన్న ప్రచారం కూడా ఉంది. అంతా సజావుగా సాగితే రజినీ కాంత్ పార్టీ మక్కల్ సేవై కట్చీ ప్రకటన ఈరోజు వచ్చి ఉండేది. ప్రస్తుతానికి ఇక ఆ పార్టీ ప్రస్తావన లేనట్టే. రజినీ ఏ లెక్కలు వేసుకున్నారో తెలియదుగానీ మొత్తానికి ఆయన రాజకీయంగా వెనక్కి తగ్గారు.
ఆధ్యాత్మిక రాజకీయం ఏమిటో?
ఆధ్యాత్మిక రాజకీయం మన దేశానికి కొత్త కాదు. మతవాద పార్టీలన్నీ చేసిది ఆధ్యాత్మిక రాజకీయం కాక మరేమిటి? భాజపా కూడా ఆ అమ్ముల పొదిలోంచి వచ్చిందే. సెక్యులర్ పార్టీలకు దాదాపు కాలం చెల్లిపోయింది. కానీ తమిళనాడులో ఇంకా ఆ పరిస్థితి రాలేదు. అది మొదలు కావాలంటే రజినీ లాంటి బలమైన శక్తులు ఏమైనా రావాలి. ఒక దశలో ప్రధాని నరేంధ్ర మోడీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగానూ రజినీ పోల్చారు. రజినీ ఇలా వెనక్కితగ్గడం భాజపాకు మింగుడు పడటం లేదు. తుగ్గక్ ఎడిటర్ గురుమూర్తి లాంటి వారు ఒక విధంగా రజినీని రాజకీయాల వైపు ప్రేరేపించారనవచ్చు.
2017లోనే రజినీని ఈ దిశగా ఆలోచింప జేశారాయన. డీఎంకే ఓట్లను చీల్చడమే భాజపా లక్ష్యంగా కనిపిస్తోంది. 2016లో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ద్వారా కూడా ఇలాంటి ప్రణాళికతోనే ఓట్ల చీలికి రాజకీయం నడిచింది. అందులో భాగంగానే ఏఐడీఎంకే విజయం సాధించింది. కేవలం 1 శాతం ఓట్ల తేడాతోనే అన్నాడీఎంకే అధికారం లోకి వచ్చింది. ఈసారి కూడా డీఎంకే ఓట్లు చీలితే ఆ విధంగా ఏఐఏడీఎంకే లబ్ది పొందడమో, రజినీ ప్రభావం ఎక్కువగా ఉంటే అధికారం చేజిక్కించుకోవడమో వ్యూహంగా ఉంది. ఇంత పెద్ద వ్యూహానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
తమిళ రాజకీయాలకు హైదరాబాద్ వేదికైందా?
రాజకీయ పార్టీ మీద రజినీకాంత్ ఓ నిర్ణయానికి వచ్చాక తన సినిమా ‘అన్నాత్తే’ షూటింగును పూర్తిచేయడానికి రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు. షూటింగ్ జరుగుతుండగా కొందరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఈలోగా రజినీకాంత్ అనారోగ్యం వార్త వచ్చింది. ఈ గ్యాప్ లో రజినీ కాంత్ నిజంగానే అనారోగ్యం పాలయ్యారా అనే సందేహాలు కూడా జనంలో ఉన్నాయి. ఈ గ్యాప్ లో రజినీతో కొందరు భేటీ అయి లాభనష్టాలను బేరీజు వేశారని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని రజినీకి బోధించారనే ప్రచారం కూడా జరుగుతోంది.
రామోజీ ఫిలింసిటీలో రజనీ ఎవరెవరిని కలిశారు? వారు ఇచ్చిన సలహాలు ఏమిటి ? అనేది కూడా చర్చనీయాంశమైంది. రజినీకి సన్నిహితంగా ఉండే చిరంజీవి, మోహన్ బాబు లాంటి వారు కూడా ఇప్పుడు రాజకీయాలు వద్దు అని రజినీకి సలహా ఇచ్చారని కూడా అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే రజినీ అనారోగ్యం అనే దాన్ని సాకుగా చూపి అపోలోలో ఓ డ్రామా నడిపి కథను ఇలా ముగించారన్న ప్రచారం కూడా సాగుతోంది. రాజకీయాల విషయంలో రజినీ ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి వేస్తున్నాడు. దాంతో కొన్ని శక్తులు రజినీని శాసించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
దేవుడు శాసిస్తున్నాడు రజనీ పాటిస్తున్నాడు అనేలా వాతావరణం క్రియేట్ చేశారేమోనన్న అనుమానాలు ఉన్నాయి. త్వరలో జమిలీ ఎన్నికలు జరుగనుండగా ఇంత రిస్క్ ఇప్పుడు అవసరం లేదు అనే మాటకే రజినీ విలువనిచ్చారన్న అంశం కూడా ఉంది. రజినీ నిర్ణయం విషయంలో అనారోగ్యం కూడా ఆయనకు బాగా సహకరించింది. నరం లేని నాలుక ఎన్నయినా మాట్లాడుతుంది. కాస్త వయసులో రాజకీయాల్లోకి వస్తే బోలెడంత కెరీర్ వదులుకుని రాజకీయాలు అవసరమా అంటారు.. కాస్త వయసు మళ్లాక రాజకీయాల్లోకి వస్తే ఈ వయసులో ఈ రాజకీయాలు అవసరమా అంటారు. అసలు రాజకీయాలకు వయసుతో నిమిత్తం ఉందా అన్నది మరో ప్రశ్న.
తలైవాకి ఫిజికల్ గా ఫిట్ నెస్ లేదన్నది మాత్రం వాస్తవం. ఆయనకు ఇంచుమించు అదే వయసు వాడైన కమల్ మాత్రం మంచి ఫిట్ నెస్ తోనే ఉన్నారు. ఒకవిధంగా రజినీ రాజకీయాలను వాయిదా వేసుకోవడమే మంచిది. రజీనీది మొదట్నుంచీ నాన్చుడు ధోరణే. సినిమాల విషయంలోనూ అదే జరిగింది. రెండు మూడేళ్లు గ్యాప్ ఎందుకు అవసరమో అర్థం కాదు. ఎన్టీఆర్, ఎయన్నార్, కృష్ణ లాంటి నటులు వందల్లో సినిమాలు చేసినప్పుడు ఇంత క్రేజ్ ఉన్నా రజినీ చేసిన సినిమాలు బాగా తక్కువ.
ఇక వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లో రజినీ ఎవరికి మద్దతు అంశంపైనే ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అంతో ఇంతో రాజకీయాల వైపు రజినీ మొగ్గు చూపాడు కాబట్టి రజనీ మద్దతు కోరే పార్టీలు కూడా ఈసారి ఎక్కువగానే ఉంటాయి. ఇక రజినీ స్థాపించిన మక్కల్ మండ్రమ్ ఏంచేస్తుందో కూడా చూడాలి. రాజకీయాలకు అతీతమైన ప్రజాసేవ వైపు ఈ రజినీ మక్కల్ మండ్రమ్ మొగ్గుచూపే అవకాశాలే ప్రస్తుతానికి ఎక్కువ.
– హేమసుందర్ పామర్తి