కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది పిట్టల్లా రాలిపోయారు. కూలీలు, వలస కార్మికులు, చిరు వ్యాపారులు అనే తేడా లేకుండా సామాన్య పౌరులు కరోనా కాటుకు బలయ్యారు. తండ్రులు లేక పిల్లలు.. భర్తలు కోల్పోయి మహిళలు.. కొడుకుల మరణంతో తల్లిదండ్రులు.. ఇలా కుటుంబ పెద్దలను, ఆత్మీయులను కోల్పోయి అనాథలుగా మారారు. వికత జీవులుగా మారారు. కనీసం ఒక పూట కడుపు నింపుకోని పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను కేంద్రమే ఆదుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 లక్షల నష్టపరిహారం అందించి, ఆదుకోవాలని సూచించింది.
కొవిడ్ కు 3.98 లక్షల మంది బలి
కరోనా సెకండ్ వేవ్ దేశమంతటా విస్తరించింది. అన్ని రాష్ట్రాల్లోనూ లెక్కకు మించి మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా 3.98లక్షలకు పైగా కరోనాతో చనిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే కరోనా మరణాలకు లెక్కేలేదు. కనీస వసతులు, ఆక్సిజన్ నిల్వలు, వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంతో వేల్లల్లో చనిపోయారు. తమ వైఫల్యాలు బయట పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మరణాలను సైతం దాచిపెట్టాయి. కాకి లెక్కలు చూపించి చేతులు దులుపుకున్నాయి. దేశవ్యాప్తంగా 3.98 లక్షల కరోనా మరణాలు జరిగాయని కేంద్రం ప్రకటించింది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ సంఖ్య ఎక్కువగానే ఉంది.
4 లక్షలు ఇవ్వలేరా?
జాతీయ విపత్తు కింద కొవిడ్ కుటుంబాలను ఆదుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే అంతమందికి నష్టపరిహారం ఇవ్వలేమని కేంద్రం కోర్టుకు వెల్లడించింది. కరోనా విజృంభణ సమయంలో అత్యవసర వైద్యసేవలు, పరికరాలను సమకూర్చుకోవడం, తుపానులు, వరదలు వచ్చినప్పుడు.. తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని ముఖం చాటేసింది. బీజేపీ అధికారంలో రాగానే.. బడా కార్పొరేట్ బాబుల రుణాలు దాదాపు 4 లక్షల కోట్లు మాఫీ చేసిందని, కాని కరోనా వల్ల కుటుంబ పెద్దను కోల్పోయిన పేదలకు 4 లక్షల రూపాయలు ఇవ్వలేరా అని పలువురు మండిపడుతున్నారు. 20 వేల కోట్లు వెచ్చిస్తే దేశవ్యాప్తంగా ప్రతి కొవిడ్ కుటుంబానికి ఆదుకోవచ్చని, ఆర్థిక నిపుణులు సైతం చెప్పారని అన్నారు. కరోనా నష్టాన్ని అధిగమించడానికి 26 లక్షల కోట్ల ఆర్ధిక ఉద్దీపన ప్రకటించిన కేంద్రం, అందులోంచి 20 వేలకోట్లు కొవిడ్ కుటంబాలకు ఎందుకు కేటాయించకలేకపోతోందని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు.











