అశేష క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్, ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అరణ్యవాసానికి రాముడు వెంట లక్షణుడు నడిచినట్లు ధోని క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వెంటనే సురేష్ రైనా కూడా ఆటకు స్వస్తి పలికాడు. టీమిండియాకు వరల్డ్ కప్, టీ20 కప్, ఛాంపియన్స్ ట్రోపి అందించిన ఘనత ధోనిది. ఇప్పటి వరకు టీమిండియాకు విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన కీపర్ (183) వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ధోని సిక్స్ తో మ్యాచ్ ముగించాడు. ధోని సిక్స్ కొట్టిన ఆ సిగ్నేచర్ షాట్ క్రీడా అభిమానుల మెదడులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ధోని మార్క్ హెలికాఫ్టర్ షాట్లను, సిక్సర్లను క్రీడా అభిమానులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.
బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోని 2019 జులై 9న తన చివరి మ్యాచ్ ను ఆడిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన వరల్డ్ కప్ సెమీస్ లో మార్టిన్ గుప్తిల్ వేసిన అద్భుత త్రోకు ధోని రనౌట్ అయ్యాడు. ధోని అప్పుడు అవుట్ అయిన సమయం రాత్రి 7:29 నిమిషాలు. అదే సమయానికి ఆగష్టు 15న ధోని తన సుదీర్ఘ కెరీర్ కు స్వస్తి పలికాడు. ధోని సెమీస్ మ్యాచ్ తరువాత ఇప్పటి వరకు క్రీడా మైదానంలోకి దిగలేదు. క్రీడా పండితులు, క్రీడా అభిమానులు ధోని కెరీర్ ను కొనసాగించాలని కోరినా యువకులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ధోని రిటైర్మెంట్ ప్రకటించాడని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇదే సమయంలో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ సురేష్ రైనా ఆటకు స్వస్తి పలకడం క్రీడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 33 సంవత్సరాల వయసులోనే రైనా ఆటకు గుడ్ బై చెప్పడంపై క్రీడా వర్గాలు కూడా షాక్ తిన్నాయి. ఈ నేపథ్యంలోనే రైనా మాజీ సహచరులు రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ కూడా రైనా నిర్ణయంపై షాక్ తిన్నామని ట్వీట్ చేశారు. యువకుల జోరుతో రైనా గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియాలో స్థానాన్ని కోల్పోయారు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నారు. ఈ సందర్భంలో టీమిండియాకు తిరిగి ఆడటం సాధ్యం కాదనే ఉద్దేశంతో రైనా ఆటకు రిటైర్మెంట్ చెప్పారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
టీమిండియా తరుపున మొదటి టీ20 సెంచరీ చేసిన ఘనత రైనా సొంతం. 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ తో కలిసి రైనా ఆడిన ఇన్నింగ్స్, సెమీస్ లో పాక్ తో ఆడిన కీలక ఇన్నింగ్స్ ను అభిమానులు మరిచిపోలేరు.ధోని-రైనా ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంపై ఐసీసీ కూడా స్పందనను తెలియచేసింది. ” ధోని రిటైర్స్..వన్ ఆఫ్ ది గ్రేట్” అంటూ ట్వీట్ చేసింది. సురేష్ రైనాను ఉద్దేశించి 2011 వరల్డ్ కప్ క్వార్టర్స్ లో పాకిస్థాన్ తో ఆడిన ఇన్నింగ్స్, సెమిస్ లో పాక్ పై ఆడిన కీలక ఇన్నింగ్స్ అందరికి గుర్తుంటుందంటూ ట్వీట్ చేసింది.
ఇదే సమయంలో ధోని-రైనా అద్భుత జోడి అంటూ ఐసీసీ ప్రశంసల జల్లులు కురిపించింది. 73 ఇన్నింగ్స్ లలో ఈ జోడి 3585 పరుగులు చేసింది. 56.90 ఏవరేజ్ తో ఈ జోడి 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోపి విజేతలుగా నడపడంలో కీలక పాత్ర పోషించిందని ఐసీసీ ట్వీట్ చేసింది. కెరీర్ లో 350 వన్డేలు ఆడిన ధోని 10773 పరుగులు చేయగా 98టీ20లు ఆడాడు. రైనా 226 వన్డేలు ఆడి 5615, 78 టీ20లు ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు స్వస్తి పలికిన ఈ జోడి ఐపీఎల్ లో తిరిగి చూడవచ్చు. ఈ రామలక్ష్మణులు ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న విషయం విదితమే.