వరద నష్టం చూడ్డానికి సాయం అందించగల పెద్దలు వస్తున్నారంటే.. సహజంగా మన కష్టాలు తీరుతాయనే ఆశ పుట్టాలి. అంతే తప్ప- కష్టం మొత్తం తీరిపోయిన తర్వాత.. ఏడ్చిన్న కన్నీళ్లు అన్నీ ఇంకిపోయిన తర్వాత.. జీవితం మళ్లీ యథోరీతిగా గాడిన పడ్డ తరువాత.. మన బతుకులు మనం మామూలు పరిస్థితుల్లో బతకడం అలవాటు చేసుకున్నాక.. సాయం చేసే వాళ్లు వస్తే ఎంత రాకపోతే ఎంత? ఏదో వచ్చినట్టుగా బిల్డప్ కోసం వారికి, నిధులు పుచ్చుకోవడానికి ప్రభుత్వానికి ఇది అవసరమే తప్ప.. వాస్తవంగా వరదకష్టం పడిన జీవితాలకు నెల తర్వాత.. కష్టాల పరిశీలనకు బృందాలు రావడం- అంటేనే.. సాయం కోసం ఆశ కంటె, ఆసక్తి కంటె అసహ్యమే ఎక్కువ పుడుతుంది.
నెలతర్వాత పరిశీలనకు వచ్చిన బృందం నివేదికలు తయారుచేసేదెప్పుడు.. వాటిని కేంద్రంలోని పెద్దలు పరిశీలించేదెప్పుడు..? నిధులు వచ్చేదెప్పుడు.. నష్టపోయిన వారికి ఆ మేర సాయం అందేదెప్పుడు?
అతి పెద్ద నష్టాలకు.. అతి జాప్యపు పరామర్శ
గత నెలలో ఏపీని వరదలు ముంచెత్తాయి. గడచిన 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు పలు జిల్లాలను ముంచెత్తాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతోపాటు అనంతపురం జిల్లాలో తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. వరదలకు నష్టపోయిన రైతాంతాన్ని ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో ఏపీలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం నెల రోజుల తరవాత తీరిక చేసుకుని వరద ప్రభావిత పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలించడానికి ఏపీకి చేరుకుంది.
ముందుగా వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎస్ నీలం సాహ్నితో సమావేశమై వరద నష్టంపై వివరాలు సేకరించేందుకు బయలుదేరారు. వరద నష్టంపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించనున్నారు. తరవాత మూడు బృందాలుగా విడిపోయి ఐదు జిల్లాల్లో వరద నష్టం అంచనా వేయనున్నారు.
నష్టం అపారం
అక్టోబర్ మాసంలో కృష్ణా నదికి వచ్చిన వరదలతో లంక గ్రామాల్లో అపార పంట నష్టం వాటిల్లింది. 17540 హెక్టార్లలో అరటి, పసుపు, మిర్చి, కూరగాయల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పది వేల మంది రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 419 కిలోమీటర్ల రోడ్లు వరదలకు దెబ్బతిన్నాయి. ఏపీ మొత్తం మీద వరదలు, అతి భారీ వర్షాలకు రైతులకు 10వేల కోట్లు, రోడ్లకు రూ.2,800 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 17 మండలాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. విద్యుత్ శాఖకు కూడా కోట్లాది నష్టం వాటిల్లింది.
గుంటూరు జిల్లాలోనూ వరిపంటకు, ఉద్యానపంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఇక ఉభయగోదావరి జిల్లాల్లో అతిభారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. అతి వర్షాల వల్ల వరిపంటలో మానుకాయ వచ్చి ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి నష్టం వాటిల్లిందని రైతుల వాపోతున్నారు. ఇక కూరగాయలు, ఆకుకూరల పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉభయగోదావరి జిల్లాలో వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది.
కేంద్ర బృందం పర్యటన ఇలా సాగుతుంది
వరదలు పోయిన నెల రోజులకు తీరిగ్గా వచ్చిన కేంద్ర బృందం మూడుగా విడిపోయి, ఇవాళ కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలో పర్యటించనుంది. మంగళవారం నాడు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేయనుంది.
కృష్ణా జిల్లాలోని మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో వరదలకు నష్టపోయిన పొలాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. నష్టపోయిన పంటల పరిశీలన అనంతరం ఇవాళ సాయంత్రానికి కేంద్ర బృందం కృష్ణా జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. వరదల నష్టం వివరాలను అధికారులను అడగి తెలసుకోనున్నారు.
వరదలు పోయిన నెల రోజులకా…
ఏపీలో వరదలు తగ్గిపోయి నెలరోజులు అవుతోంది. ఇప్పడు పొలాలన్నీ వరదనీటి నుంచి బయటపడ్డాయి. తీరిగ్గా నెల రోజుల తరవాత కేంద్ర బృందం వరదనష్టం అంచనాలకు రావడంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా బ్రిటీష్ సాంప్రదాయం కొనసాగిస్తుందేమోననే అనుమానం వస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు వస్తే నష్టం కంటికి కనిపిస్తుంది. ఉన్నతాధికారులు బురదలో తిరగలేరు కాబట్టి వరదలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తరహాలో హెలికాఫ్టర్లో పంటనష్టం పరిశీలించాల్సిందని బాధితులు అభిప్రాయపడుతున్నారు. పోనీలే ఇప్పటికైనా వరదనష్టం అంచనాకు వచ్చారు. ఇక పరిహారం ఎప్పటికి విడుదల చేస్తారో? అది బాధితులకు ఎప్పటికి చేరుతుందో ఆ దేవుడికే ఎరుక.











