ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు గిట్టుబాటు కావన్న వాదన ఇటీవల కాలంలో ఊపందుకుంది. ఈ విషయంలో ప్రభుత్వంతో అనేక సార్లు జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. సినీ ప్రముఖులు, ఫిలిం ఛాంబర్, ఎగ్జిబిటర్ల తరఫున ప్రతినిధులు మంత్రి పేర్ని నానిని కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై రాంగోపాల్ వర్మ కూడా వెళ్లి మంత్రి నానిని కలిసి వచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని సీఎం జగన్ విందుకు ఆహ్వానించారు. అయినా ధరల మీద క్లారిటీ రాలేదు.
సీఎం జగన్ తో చిరంజీవి భేటీ సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించినది కాదని మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఇవన్నీ పక్కన పెడితే పెద్ద సినిమాలన్నీ విడుదల కాకుండా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నెల 11న రవితేజ ఖిలాడి విడుదల కాబోతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో పెద్ద సినిమాల విడుదల ఉంది.
టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నెల 10వ తేదీన ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ల ధరలు కొద్దిగా పెంచడానికి కమిటీ సిఫార్సులు చేసినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం కొత్త ధరలను రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమంలో ఈ వార్త అంతర్గతంగా వినిపిస్తోంది. రవితేజ ఖిలాడికి కూడా ఇది కలిసి వచ్చిందనే అనుకోవాలి.











