(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఎవరి పట్ల ఎలా వ్యవహరించినా .. నవ మాసాలు మోసిన కన్న తల్లి అంటే దేవతగా భావిస్తారు.. నవమాసాలు మోసి కని పెంచిన అమ్మ లేని జీవితం లేదనుకుంటారు. కానీ ఇటీవల కొందరు పిల్లలు కన్న తల్లిపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో ఇటువంటి దారుణమే చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్నతల్లినే గొంతు నులిమి చంపేసింది ఓ కూతురు. అయితే అతి తెలివిగా హత్యను.. సహజ మరణంగా చిత్రీకరించింది. ఏం తెలియనట్టు కన్న తల్లి చనిపోయింది అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. బతికించడానికి పోరాడుతున్నట్టు డ్రామాలు ఆడింది. తనకే పాపం తెలియదు అంటూ అందర్నీ నమ్మించింది.
కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆమెను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు…
విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లిలో ఈనెల 6న లక్ష్మి (40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతిచెందినట్లు కేసు నమోదైంది. వైద్యులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో విస్తుగోలిపే నిజం బయటకు వచ్చింది. రూపశ్రీ అనే అమ్మాయి అదే గ్రామానికి చెందిన వరుణ్ సాయి అనే అబ్బాయిని ప్రేమించింది. అతనిని పెళ్లి చేసుకుంటానని తల్లికి చెప్పింది. కానీ .. ఆ తల్లి కుమార్తె మాటకు అడ్డుచెప్పింది. అప్పటికే చిన్నకూతురు ప్రేమ పేరుతో కులాంతర వివాహం చేసుకుని పలాయనం చిత్తగించడంతో .. పెద్దకూతురును మంచిమార్గంలోకి తీసుకువెళ్లాలని మందలించింది. ఆ మాటలు నచ్చని రూపశ్రీ, తన ప్రియుడు వరుణ్ సాయితో కలసి ఆమెను చంపడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని ప్రియుడి సాయంతో దిండుతో అదిమిపెట్టి చంపే ప్రయత్నం చేసింది రూపశ్రీ. స్పృహ కోల్పోయిన తల్లి లక్ష్మి చనిపోయిందని ఆమె భావించింది. దీంతో ఆమె ప్రియుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రూపశ్రీ ఏమీ తెలియనట్లు తండ్రికి సమాచారం ఇచ్చింది. కిందపడి తల్లి చనిపోయిందంటూ సహజ మరణంగా నమ్మబలికింది. తండ్రి అక్కడి ఓ ఆర్ఎంపీ వైద్యుడికి సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్ .. లక్ష్మిని పరిశీలించి ప్రాణం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె చనిపోయింది. ఆ డాక్టర్కు లక్ష్మి మరణం సహజమైనది కాదని అనుమానం వచ్చింది. అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రూపశ్రీ, వరుణ్సాయిలను నిందితులుగా గుర్తించి .. అరెస్టు చేసి జైలుకు పంపించారు.











