కేటీఆర్ సీఎం అవుతారని జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఎలాంటి క్లారిటీ లేకుండా దీనిపై ఎందుకు మాట్లాడుతున్నారని, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పనితీరు బాగుంటేనే రానున్న ఎన్నికల్లో టిక్కట్లు ఇస్తామని చెబుతూనే.. మరో పదేళ్లు సీఎంగా తానే ఉంటానని వ్యాఖ్యానించారు. వీటితోపాటు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కొన్ని విషయాలు బయటకు చెప్పలేనని, రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీని కాపాడుకోవడం మాత్రమే తన ప్రాధామ్యాలన్నారు. కాగా కేసీఆర్ సంచలన నిర్ణయం ఏమైనా వెల్లడిస్తారేమోనని చూసిన వారికి కేసీఆర్ వ్యాఖ్యలు షాకిచ్చాయి. ఆదివారం తెలంగాణభవన్లో చానాళ్ల తరువాత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్లు, జడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులు హాజరయ్యారు. వీరితోపాటు పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలూ హాజరయ్యారు.
ఘాటు వ్యాఖ్యలతో మంత్రుల షాక్..
కేటీఆర్ సీఎం అవుతారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలోనే నేను అసెంబ్లీలోనే చెప్పాను..ఇంకా క్లారిటీ రాకపోతే ఎలా..నేను సీఎంగా ఉండడం మీకు ఇష్టం లేదా, రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా..నాకు సీఎం పదవి పెద్ద లెక్క కాదు.. తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల గుండెల్లో, ప్రతి ఇంట్లో చిరస్థాయిగా ఉంటా.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు, నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని, అనవసర రాద్దాంతం చేయవద్దని’’ వ్యాఖ్యానించారు. రానున్న పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రెండేళ్ల క్రితం జరిగిన సభ్యత్వం కంటే ఈ సారి ఎక్కువగా ఉండాలని, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 50 వేల మంది సభ్యులను చేర్పించాలని కోరారు.
ఫిర్యాదులపై సీరియస్..
కాగా పార్టీలో కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలతో పాటు ఫిర్యాదులపైనా కేసీఆర్ సీరియస్ అయ్యారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే ఆధిపత్యం ఉంటుందని, మంత్రులు, ఇతరులు వేలు పెట్టొద్దని చెప్పాను. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ చేస్తున్నారు. వాళ్లు మారాలి. మారకుంటే పీకి పడేయడం నాకు లెక్క కాదు. లూజ్ టాక్ చేస్తే బండకేసి కొట్టి.. పార్టీ నుంచి బయటకు పారేస్తాను అని ఘాటుగా వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరికి ఇవ్వాలనేది అదేరోజు వెల్లడిస్తామని చెప్పిన కేసీఆర్..అందుకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం తదితర అంశాలపై మాట్లాడారు.
షర్మిలను ఉద్దేశించినవేనా..
కాగా కేసీఆర్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలూ చర్చనీయాంశమయ్యాయి. కొత్త పార్టీ పెట్టడం ఈజీ కాదు.. పెట్టినా నిలబెట్టగలగాలి. తెలుగుదేశం పార్టీ తరువాత నిలదొక్కుకున్నది టీఆర్ఎస్ పార్టీనే. నరేంద్ర, విజయశాంతి, దేవేందర్గౌడ్లు పార్టీలు పెట్టారు. జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి లాంటివారూ పార్టీ పెట్టారు. తరువాత సక్సెస్ కాలేదు. పార్టీ పెట్టడం ఈజీకాదు అని వ్యాఖ్యానించారు. అయితే కొన్నాళ్ల క్రితం వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడతారని ఓ పత్రిక కథనం రాసిన నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కేటీఆర్ సీఎం అని వ్యాఖ్యలు చేసిన వారిపై..
కొన్నాళ్ల క్రితం పలువురు టీఆర్ఎస్ నేతలు మంత్రులు కేటీఆర్ సీఎం అవుతారని, అయితే తప్పేంటని వ్యాఖ్యానించారు. ఈటల రాజేంద్ర, తలసాని, టి.పద్మారావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కి గురిచేశాయి. నిజంగానే అలాంటి ఆలోచన కేసీఆర్కి లేదా అనే చర్చ మొదలైంది. కేసీఆర్కి అలాంటి ఆలోచన ఉన్నా..ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం, రానున్న కాలంలో అధికారంలోకి రావడం కోసం తత్కాలికంగా ఆ ప్రచారానికి బ్రేక్ వేశారా అనే చర్చ నడిచింది. మొత్తం మీద కేసీఆర్ మరోసారి తన స్టైల్లో షాక్ ఇచ్చారని చెప్పవచ్చు.