ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఓ మొక్క ఇచ్చిన అలీ లెక్క ఏమిటో అర్థంగావడం లేదు. ఊరక రారు మహానుభావులు అని జగన్ అనుకున్నారో లేదోగాని ఇది మాత్రం మర్యాదపూర్వక కలయికేనని అలీ అంటున్నారు. అసలు అసెంబ్లీ ఎన్నికల్లోనే తనకు టిక్కెట్ ను అలీ ఆశించారు. పోనీ ఆ తర్వాత పదవులు ఏమైనా దక్కుతాయా అనుకుంటే అదీ లేదు. నటుడు పృధ్వీ మాత్రం ఎస్వీబీసీ అధ్యక్ష పదవిని దక్కించుకుని ఎంచక్కా కొంతకాలం ఆ పదవిని అనుభవించారు.
ఎట్టకేలకు ఆయన ఇంటికి వెళ్లారనుకోండి… మరి అలాంటి పదవి మీద కూడా అలీకి దృష్టి ఉండొచ్చేమో. ‘దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుస్తారంటూ అలీ కితాబిచ్చారు కూడా. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నేతను మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి ఆయన వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నపుడు విమర్శించేవారుంటారు. వారు చేయలేక పోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారు’ అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ ఎన్నికల్లో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున ప్రచారం చేశారు. అలీ మర్యాద పూర్వకంగా కలిశానని అన్నా దాని వెనుక మతలబు ఏదో ఉంటుందని సినీ జనులు అంటున్నారు.