అమరావతి రాజధాని రైతులను అన్నీ పార్టీలు మోసం చేశాయని ధైర్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉండగా రైతులకు చేయాల్సినంత సాయం చేయలేదు. రాజధాని రైతులకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోవడం పెద్ద పొరపాటు. ఇక టీడీపీ అధికారం కోల్పోయాక రాజధాని రైతుల పక్షాన నిలవడంలో ఆ పార్టీ విఫలమైంది. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3 రాజధానుల ప్రకటన తరవాత కేవలం ఒక్కసారి మాత్రమే అమరావతిలో పర్యటించారు. ఏపీలో బీజేపీతో కలసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న జనసేన అమరావతి రాజధాని రైతుల విషయంలో మాత్రం అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని జనసేన భావిస్తుందా? అదే నిజమైతే… ఏ మొహంపెట్టుకుని గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో జనసేన నేతలు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు.
బీజేపీతో చేతులు కలపడమే కారణమా?
అమరావతి రాజధాని రైతుల హక్కుల కాపాడే విషయంలో జనసేన నేతలు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జనసేన అధినేత 3 రాజధానుల ప్రకటన తరవాత కేవలం ఒక్కసారి మాత్రమే అమరావతిలో పర్యటించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాజధానికి ఇంత భూమి అవసరం లేదని, మూడు పంటలు పండే భూములు తీసుకుంటున్నారని, రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని ప్రతి నెలా ఉద్యమాలు చేసిన పవన్ కళ్యాణ్ నేడు ఎందుకు మౌనం వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి జననేత రాజధాని ప్రాంతంలో అమరావతి రైతుల వాయిస్ వినిపిస్తే ఆ పార్టీకి కూడా మంచి మైలేజీ వస్తుంది కదా? అయినా ఆ పార్టీ అమరావతి విషయంలో వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం బీజేపీతో చేతులకు కలపడమే అని తెలుస్తోంది. ఏపీ బీజేపీలో ఎవరి దారి వారిదే… ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయింది. అధికార పార్టీ అనుకూలంగా కొందరు, ప్రతిపక్షానికి దగ్గరగా మరికొందరు. ఒక్కో నేత ఒక్కో స్టేట్ మెంట్ ఇస్తారు. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదని కూడా బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పారు. మరి అలాంటి పార్టీతో జనసేన కలసి ఎలా ముందుకు సాగుతుంది.
జనసేనకు కూడా 3 రాజధానులే ఇష్టమా?
అమరావతి రాజధానికి భూములు ఇచ్చి రోడ్డున పడ్డ రైతుల పక్షాన పోరాడేందుకు పార్టీలు ముందుకు రావడం లేదు. ఏదో మీడియా ముందు కనపడి మమ అనిపించుకుంటున్నారు. ప్రతిపక్షాలు రైతుల పక్షాన బలంగా నిలబడితే అమరావతి రాజధాని రైతులకు కొండంత అండ లభిస్తుంది. ఎంత సేపటికీ 29 గ్రామాల రైతుల సమస్యగానే అమరావతి రాజధాని ఉధ్యమాన్ని పరిమితం చేశారు.
అమరావతి ఉధ్యమాన్ని 13 జిల్లాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంది. కానీ అలా ఎవరూ చేయడం లేదు. స్వయంగా నేటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అమరావతి రాజధానికి అంగీకరించారు. అదే అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీనిపై బలంగా పోరాడాల్సిన ప్రతిపక్షాలు చేతులెత్తేశాయి. గట్టిగా పోరాడితే కేసులు పెట్టి జైల్లో పెడతారేమో అని నాయకులు బయపడుతున్నట్టు కనిపిస్తోంది.
పవన్ అండగా నిలుస్తారా? లేదా?
పెద్దలకు బలంగా పనిచేసే చట్టాలు, పేదలకు న్యాయం చేసే విషయంలో మాత్రం మొద్దునిత్రపోతుంటాయని ఎప్పుడూ చెప్పే జనసేన అధినేతకు రాజధాని రైతులు గుర్తు రావడం లేదా? రాజధాని అంటే కేవలం 29 గ్రామాలకేనా? 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతికి కాపాడుకునే విషయంలో జనసేన చేయాల్సిన స్థాయిలో ఉధ్యమం చేయలేదని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా జనసేన అధినేత రంగంలోకి దిగి అమరావతి ఉధ్యమానికి మద్దతు ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. కరోనా దెబ్బతో అమరావతి ఉధ్యమం కొంత వెనుకబడింది. కరోనా తగ్గాక అయినా అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు ఎవరెవరు ముందుకు వస్తారో వేచి చూడాల్సిందే.