ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ షోలో.. అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టారు. డిబేట్ సాగుతూ ఉండగా.. ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటా మాటా పెరిగిపోయింది. ఇద్దరూ రెచ్చిపోయారు. ఇంతలోనే అమరావతి నాయకుడు శ్రీనివాస్.. తన కాలిచెప్పు బయటకు తీసి.. పక్కనే కూర్చుని ఉన్న బీజేపీ విష్ణువర్దన్ రెడ్డిని కొట్టారు. దీంతో ఆ డిబేట్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న వెంకటక్రిష్ణ.. ‘దిసీజ్ టూమచ్’ అంటూ.. లైవ్ కట్ చేయించడం.. ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది.
అమరావతిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణలను పూర్తి చేయడానికి రాష్ట్రప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకువచ్చి పనులు పూర్తి చేయడానికి మంత్రివర్గం తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీదనే ఏబీఎన్ లో వెంకటక్రిష్ణ చర్చ నిర్వహించారు. ఇందులో అమరావతి జేఏసీ తరఫున శ్రీనివాస్, బీజేపీ తరఫున విష్ణువర్దన్ రెడ్డి తదితరులు అనేకులు పాల్గొన్నారు.
విష్ణువర్దన్ రెడ్డి చర్చలో మాట్లాడుతూ.. రైతుల ఆకాంక్షలు తీర్చే విధంగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని.. ఇది స్వాగతించాల్సిన పరిణామం అని.. అంటూ.. జగన్ నిర్ణయాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. వ్యవహారాన్ని అమరావతి నుంచి అప్పుల మీదికి మళ్లించారు. మన రాష్ట్రానికి చాలా మంది ఘనమైన ముఖ్యమంత్రులు పనిచేశారని.. అప్పులు తేవడాన్ని గొప్పగా టముకు వేసుకుంటూ తిరిగేవాళ్లని.. అంటూ.. పరోక్షంగా చంద్రబాబునాయుడును ఎద్దేవా చేశారు.
అసలు డిస్కషన్ పక్కదారి పట్టిపోతోందనే ఉద్దేశంతో.. అమరావతి శ్రీనివాస్ దీనిని అడ్డుకున్నారు. ‘ఏం మాట్లాడుతున్నారు మీరు’ అంటూ నిలదీయడంతో.. డిబేట్ వేడిగా మారింది. ‘హద్దు దాటుతున్నావు’ అని విష్ణువర్దన్ రెడ్డి అనడం, ‘యూ ఆర్ టాకింగ్ నాన్సెన్స్’ అని పదేపదే అంటూ.. ‘వందసార్లైనా అంటా’ అంటూ శ్రీనివాస్ రెచ్చిపోవడం జరిగింది.
దానికి విష్ణువర్దన్ రెడ్డి.. నీ పార్టీ భజన చేయమంటావా.. వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని పనిచేసుకో, చంద్రబాబు భజన చేయాలా.. మీ పార్టీ భజన చేయాలా అంటూ రెచ్చిపోయారు. ఈలోగా శ్రీనివాస్.. లైవ్ నడుస్తుండగానే.. తన కాలి చెప్పు తీసి.. విష్ణువర్దన్ రెడ్డిని కొట్టడం హఠాత్తుగా జరిగిపోయింది.
దిసీజ్ టూ మచ్.. అంటూ.. వెంకటక్రిష్ణ జోక్యం చేసుకుని.. అప్పటికి లైవ్ కట్ చేయించారు.
నీతి మాలిన రాజకీయాలకు పరాకాష్ట
నాయకులమనే ముసుగులో చెలరేగుతున్న వారి నీతిమాలిన వ్యవహారాలకు, వాదనలకు ధోరణలకు బుద్ధి పతనానికి ఏబీఎన్ ఛానెల్ ఘటన ఒక ఉదాహరణ. అడ్డగోలుగా వాదించడంలో రెచ్చిపోయిన నాయకులు.. పరస్పర వ్యక్తిగత దూషణలుగా డిబేట్ ను మార్చేయగా.. అది చెప్పుదెబ్బల దాకా వెళ్లడం సిగ్గు చేటు.
Must Read ;- తాడేపల్లి విషయాలు బయటకొస్తే.. విజయసాయిరెడ్డికి రాధాకృష్ణ ‘కల’వరమే?











