విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అమరావతి రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి నుంచి బస్సుల్లో బయలుదేరి విశాఖ చేరుకున్న రైతులు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, జై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు. ప్రాంతాలు వేరైనా నష్టపోయింది మాత్రం రెండు ప్రాంతాల్లోనూ రైతులేనని అమరావతి జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
అక్కడ 22 వేలు, ఇక్కడ 33 వేల ఎకరాలు
విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 26 గ్రామాలకు చెందిన 32 వేల మంది సన్నకారు రైతులు 22 వేల ఎకరాల భూమిని నాలుగు దశాబ్దాల కిందటే ప్రభుత్వానికి అప్పగించారు. వారందరికీ పరిశ్రమలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులంతా ముందుకు వచ్చి, విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అతి తక్కువ ధరకు భూములు ఇచ్చారు. భూములిచ్చిన రైతుల్లో సగం మందికి కూడా నేటికీ ఉద్యోగాలు కాని, ఉపాధి కానీ కల్పించలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎకరా రూ.1000 నుంచి రూ.1500లకు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. విశాఖ నగరం శరవేగంగా విస్తరించడంతో నేడు అక్కడ ఎకరా భూమి రూ.5 కోట్లు పలుకుతోంది. దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమ భూములపై పెద్దల కన్ను పడింది. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో నడుస్తోందనే సాకుతో పరిశ్రమను, భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రయత్నాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రాణాలైనా అర్పిస్తాం, విశాఖ ఉక్కును కాపాడుకుంటామంటూ కార్మికుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాట సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
Must Read ;- ఒడిశా ఒత్తిడి వల్లే.. విశాఖ ఉక్కుకు అన్యాయం!

అమరావతి రైతులదీ అదే వ్యథ
విభజిత ఏపీకి రాజధాని వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతుందని అమరావతి, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాలకు చెందిన 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా, అభివృద్ధి చేసిన భూమిలో కేవలం నాలుగోవంతు తీసుకునేందుకు వారు అంగీకరించారు. ప్రభుత్వం మారగానే మూడు రాజధానులను తెరమీదకు తీసుకువచ్చారు. అమరావతిలో రాజధాని రైతులు కోర్టులను ఆశ్రయించారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన 28 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏడు సంవత్సరాలుగా పంటలు లేక, ఆదాయం లేక కుటుంబపోషణ కూడా భారంగా మారడంతో రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇప్పటికే అమరావతి ఉద్యమంలో 128 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో మానసిక వేదనకు గురవుతున్నారు. విశాఖ ఉక్కు రైతులది కూడా ఇదే సమస్య కావడంతో అమరావతి రైతులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారికి సంఘీభావం తెలిపారు. దీంతో రైతుల సమస్య ఎక్కడున్నా వారికి తమ మద్దతు ఉంటుందని అమరావతి రైతులు నిరూపించుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు కూడా అమరావతి రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లి నిరసనలో పాల్గొని మద్దతు ప్రకటించారు. అమరావతికి రైతు సంఘాల నేతలను ఆహ్వానించారు. రైతుల సమస్యలపై కలసి పోరాడాలని వారు నిశ్చయించారు.
ఎక్కడైనా భూములపైనే పెద్దల కన్ను..
భూముల ధరలకు రెక్కుల రావడంతో అధికారంలో ఉన్న కొందరు పెద్దలు భూములపై కన్నేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు తక్కువ ధరకు అప్పగించి ఆ భూములను కాజేసే కుట్ర సాగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక కార్మికులను కూడా రోడ్డున పడేసే పరిస్థితి వస్తోంది. అందుకే సమస్య ఎవరికి వచ్చినా అందరూ కలసి పోరాడితే ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. అందుకే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉద్యమంలో అమరావతి రైతులు పొల్గొంటున్నారు. వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారు. రాజధాని ఉద్యమానికి ఉత్తర కోస్తా జిల్లాల వారి మద్దతు కూడా తమకు లభిస్తోందని అమరావతి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై 18న ఆందోళన.. చంద్రబాబు పిలుపు











