ఏపీలో తిరుపతి లోక్సభ స్థానానికి, తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 7 లోపు ఎన్నికల షెడ్యూల్ రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియతో పాటు తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే మార్చి మొదటివారంలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, నాగార్జునసాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక కు షెడ్యూల్ వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా ఉంది. అసోం పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి.
జూన్ లోపు ఐదు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు
ఈ ఏడాది జూన్ లోపు అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పుదుశ్చేరి, కేరళలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాల్సి ఉంది. అంటే ఆలోపే ఎన్నికలు జరపాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు కావడం, పలు సున్నిత, సమస్యాత్మక, పర్వత ప్రాంతాలు ఉండడం లాంటి సమస్యలున్న నేపథ్యంలో విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగానే షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ అసోంలో మాట్లాడుతూ.. గతంలో మార్చి మొదటి వారంలోనే షెడ్యూల్ వచ్చిందని, ఈ సారి కూడా ఒకటి రెండు రోజుల తేడాతో వచ్చే అవకాశం ఉందన్నారు.
2016లో విడుదలైన షెడ్యూల్ని పరిశీలిస్తే..మార్చి4న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆ రాష్ట్రాలతో పాటు దేశంలోని 4 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నిర్ణీత కాలపరిమితి ప్రకారం.. ఎన్నికలు, ఉప ఎన్నికల విషయంలో గరిష్టంగా ఆరునెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఆ ప్రకారం చూసినా.. ఏపీలో ఏప్రిల్లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విశ్లేషణల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే సమయంలోనే తిరుపతి లోక్సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీకి కూడా షెడ్యూల్ విడుదల అవుతుందని అంచనా వేస్తున్నాయి. ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే.. మార్చి 10న జరగనున్నాయి. అదే రోజు లెక్కింపు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైనా రీపోలింగ్ జరపాల్సి వస్తే తరువాతి రోజు జరుగుతుంది. తెలంగాణ, ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే మార్చి 17తో ఆ ప్రక్రియ పూర్తవుతుంది.
పరిషత్ ఎన్నికలపై సందిగ్ధం..
కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒకటిరెండు అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, వాటిపై కోర్టు ఆదేశాల తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే..పరిషత్ ఎన్నికలు ఉంటాయన్న ప్రచారానికి తెరపడింది. మొత్తం మీద మార్చి 17తో ఏపీలో ప్రస్తుతం నోటిఫికేషన్లు విడుదలైన ఎన్నికల ప్రక్రియలన్నీ దాదాపు ఒక కొలిక్కి వస్తాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ లోగా లోక్సభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసినా.. ముందుగా ప్రకటించిన తేదీలకు ఎలాంటి అవరోధం ఉండదు. ఈ నేపథ్యంలోనే మార్చి మొదటి వారంలోనే వీటికి కూడా షెడ్యూల్ విడదల అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
మార్చి 4న తిరుపతికి అమిత్ షా..
ఇక మార్చి4న కేంద్ర హోమంత్రి అమిత్ షా తిరుపతికి రానున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సుకు అమిత్ షా హాజరు కానున్నారు. మార్చి 5న కూడా తిరుపతిలోనే ఉండనున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నాయకులతో చర్చించనున్నారు.
Must Read ;- ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్లు.. బరిలో చాలామంది











