తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. మహబూబ్నగర్ –రంగారెడ్డి- హైదరాబాద్, ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ రెండు స్థానాలకు కలిపి ప్రాథమిక సమాచారం ప్రకారం129కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ –రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి సోమవారం నాటికే 59 మంది అభ్యర్థులు 90సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం టీడీపీ నుంచి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడుఎల్ రమణ, టీఆర్ఎస్ నుంచి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిలు నామినేషన్లు దాఖలు చేశారు. మరో ఇద్దరు స్వతంత్రులు కూడా నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ తరఫున సురభి వాణీదేవి సోమవారమే నామినేషన్ వేసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చినా.. పత్రాలు సరిగ్గా లేకపోవడం, సమయం మించిపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం 70 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం ఎంతమంది బరిలో ఉన్నారనేది తెలుస్తుంది.
మార్చి 14న ఎన్నిక.. 17 ఫలితాలు
ఇక బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మార్చి14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి17న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికలు పార్టీలకు, అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో టీఆర్ఎస్తో పాటు విపక్ష పార్టీలు సైతం ఈ రెండు స్థానాలను ఎంతో ప్రతిష్టాత్మంగా భావించి, ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.
బరిలో వీరే..
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్ నాగేశ్వర్, టీడీపీ నుంచి మాజీ మంత్రి, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, ఆర్ జే డీ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ ఉన్నారు. మిగతా అభ్యర్థుల పేర్లు పదిరోజుల ముందే ఖరారైనా.. టీఆర్ఎస్ మాత్రం ఆదివారం అభ్యర్థిని ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తెను బరిలోకి దింపింది.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ నియోజకవర్గంలో భారీ పోటీ..
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ –రంగారెడ్డి- మహబూబ్నగర్ జిల్లా నియోజకవర్గంతో పోల్చితే ఇక్కడే పోటీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అధికార టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ బరిలో ఉండగా, వామపక్షాల అభ్యర్థికా జర్నలిస్ట్ జయసారథి రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరకు సుధాకర్ బరిలో ఉన్నారు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్, తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం కూడా ఇక్కడే బరిలో ఉన్నారు. జర్నలిస్టు తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుంచి జర్నలిస్టు రాణిరుద్రమ దేవి పోటీపడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే దాదాపు అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు.
Must Read ;- మరో ఎన్నికలకు నగరా.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వేడి











