నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో 72 రోజులుగా నిరసన దీక్ష కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలకు అమరావతి రాజధాని మహిళా రైతు సంఘాల జేఏసీ నేతలు సంఘీభావం తెలిపారు. ఢిల్లీలోని సింఘు, టిక్రీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్న రైతు సంఘాల నేత తికాయన్ ను కలసి సాగు చట్టాల రద్దుకు మద్దతు పలికారు. తదనంతరం అమరావతి రాజధాని రైతుల కష్టాలను ఆయనకు వివరించారు. దీంతో చలించిపోయిన తికాయత్ ఢిల్లీ ఉద్యమం ముగిశాక అమరావతి రాజధాని గ్రామాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు.
ఢిల్లీ ఉద్యమ తరహాలో అమరావతి ఉద్యమం..
సాగు చట్టాల రద్దు కోరుతూ ఉత్తరాది రైతులు ఢిల్లీలో చేపట్టిన ఉద్యమం తరహాలో అమరావతి రాజధాని ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు అమరావతి రాజధాని మహిళా జేఏసీ, దళిత మహిళా జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు ఢిల్లీలో రైతుల నిరసనకు మద్దతు పలకడంతోపాటు వారి తరహాలో అమరావతి రాజధానిలో ఉద్యమం నడిపించాలని జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలో రైతు సంఘాల నేతలకు రాజధానికి తీసుకు వచ్చి ఉద్యమంలో ఊపు తీసుకురావడంతోపాటు స్థానిక ఎన్నికల అనంతరం అమరావతి రాజధాని ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Must Read ;- రైతుల అదృశ్యం, ఖాకీలకు భద్రత లేదు.. అసలేం జరుగుతోంది?
స్థానిక ఎన్నికల తరవాత ఉవ్వెత్తున ఉద్యమం..
అమరావతి ఉద్యమం తీవ్రరూపం దాల్చే సమయంలో కరోనా వైరస్ ప్రభావం పడింది. కరోనా దాదాపుగా తగ్గుముఖం పట్టగానే స్థానిక ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. దీంతో అమరావతి ఉద్యమానికి బ్రేకులు పడ్డాయనే చెప్పవచ్చు. రాజధాని గ్రామాల్లో నిరంతరం ఉద్యమం సాగుతున్నా ఇది రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. స్థానిక ఎన్నికలు ముగియగానే ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతి రాజధాని ఉద్యమాన్ని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం రైతు సంఘాల నేతలనే కాకుండా, మేధావులు, అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలని కోరుకునే అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ఉద్యమాన్ని పెద్దఎత్తున చేపట్టేందుకు గట్టి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.
కోర్టు తీర్పులే కీలకం..
అమరావతి రాజధాని తరలింపుపై 93 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై రోజువారీ విచారణ సాగుతోంది. హైకోర్టులో రాజధాని తీర్పు కోసం అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు అమరావతి రైతు జేఏసీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజధాని తరలింపునకు అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే విశాఖకు తరలిపోవాలని వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక రాజధాని తరలింపు కేసులో హైకోర్టు తీర్పు అనుకూలంగా లేకుంటే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోపాటు, ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసేందుకు జేఏసీ నేతలు అన్నీ ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో రైతు సంఘాల నేతలను కలుస్తున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- నో ఇన్ సైడర్ ట్రేడింగ్ : అమరావతి కేసుల్లో ఆ పదం వర్తించదు!