ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించివేస్తోందని టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్, టీవీ5 ఉచిత న్యూస్ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసేందుకు, కరెంటు స్థంభాలకు ఉన్న కేబుల్ కట్ చేస్తున్నారని టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను బెదిరించే విధంగా వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. గవర్నర్ ను కలసినవారిలో వర్ల రామయ్య, ఆలపాటి రాజా, టీడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, బుద్దా వెంకన్న ఉన్నారు.
బెదిరింపులు మానడం లేదు
గవర్నర్ ఇప్పటికే సీఎస్ ద్వారా మంత్రులకు సూచనలు చేసినా వారి తీరు మార్చుకోవడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల్లో 90 శాతం ఏకగ్రీవాలు చేయాలని వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఏకంగా ఎన్నికల కమిషనర్ ను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని గుర్తుచేశారు.
Must Read ;- కేంద్రం, గవర్నర్లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..