తిరుపతి ఎన్నికల్లో వైసీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన అధికారులు, పోలీస్ శాఖకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తిరుపతి ఎన్నికల్లో వైసీపీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఇకపోతే మైనింగ్ డాన్ ఎర్రచందనం రెడ్డి, ప్రతిసారీ బలిపశువు అవుతున్నా ధనం కుమ్మరించినందుకు వి. ప్రభాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జగన్ అన్నకి ఐదు లక్షల మెజారిటీ తేవాలా, 4 లక్షలు మెజార్టీ తేవాలా అని ఇక్కడకు వచ్చి పని చేసిన నాయకులందరికీ తమ తరఫున అభినందనలు తెలుపుతున్నామని అన్నారు.
టీడీపీ భూ స్థాపితం చేయడం మీ వల్ల కాదు..
తిరుపతిలో వచ్చిన మెజారిటీ చూసి వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. 5 లక్షల మెజారిటీ ఏమైందని ప్రశ్నించారు. వచ్చిన మెజారిటీ కూడ దొంగ ఓట్లవేనని పేర్కొన్నారు. ఎన్ని జన్మలు ఎత్తినా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయలేరని అన్నారు. పోలీసు కేసులు పెట్టి బెదిరించినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబునాయుడు, లోకేష్ల నాయకత్వం కోసం పని చేశారని అన్నారు. దుర్మార్గుల్ని ఇంటికి పంపాలని పని చేసిన కార్యకర్తలకు, టీడీపీ శ్రేణులకు ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు జేస్తున్నట్లు వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు.