నవీన్ నిశ్చల్..ఈ పేరు తెలియని వైసీపీ నేతలుండరు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో వైసీపీ జెండా పట్టుకుని, కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీకి దశాబ్ధానికిపైగా అండగా నిలిచారు. సంపాందించినదంతా పార్టీ కార్యక్రమాల కోసమే ఖర్చు పెట్టారు. అలాంటి నవీన్ నిశ్చల్ను ఇప్పుడు జగన్ పార్టీ నుంచి గెంటేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి బాలకృష్ణపై 32 వేల ఓట్ల తేడాతో ఓడిన దీపికా ఫిర్యాదు చేయడంతో నవీన్ నిశ్చల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్.
జగన్ తీసుకున్న నిర్ణయంతో నవీన్ నిశ్చల్ కన్నీటి పర్యంతమయ్యారు. ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని..కానీ తనను ఒక్క మాట కూడా వివరణ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ టైం నుంచి తాను హిందుపురంలో పోరాడుతున్నానని గుర్తు చేశారు. పోటీ చేసినప్పుడల్లా స్వల్ప తేడాతో ఓడిపోయినా తర్వాత ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పార్టీలో చేరితే…మొదటి సారి బాలకృష్ణపై కేవలం 9వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని, తర్వాత తనకు ఛాన్స్ ఇవ్వకుండా ఇతరులకు ఇస్తే 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. అయినా వారి కోసం, పార్టీ కోసం తాను పని చేశానన్నారు నవీన్ నిశ్చల్.
పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తే వారి కోసం పని చేశానన్నారు. ఇప్పుడు తనకు ఎక్కడా అవకాశాలు ఉండవని..సస్పెండ్ చేసినా తాను వైసీపీ కోసమే పని చేస్తానన్నారు. జగన్కు అభిమానంగానే ఉంటానని..కొద్ది రోజులకు అయినా తన గురించి జగన్ నిజాలు తెలుసుకుంటారని చెప్పుకున్నారు. నవీన్ నిశ్చల్..వైఎస్ అనుచరుడు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత వైఎస్పై అభిమానంతో వైసీపీలో చేరిన ఆయన 2014లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేశారు. అప్పుడు కూడా 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఐతే తర్వాత నవీన్ నిశ్చల్కు జగన్ మళ్లీ అవకాశం ఇవ్వలేదు. పార్టీ తరపున కూడా ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఐనప్పటికీ నవీన్ వైసీపీ జెండా వదల్లేదు. హిందూపురం లాంటి టీడీపీ కంచుకోటలో వైసీపీ కార్యకర్తలను కాపాడుకున్నారు.
2019, 2024 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్కు టికెట్ ఇవ్వలేదు జగన్. 2019లో మహమ్మద్ ఇక్బాల్కు, 2024లో దీపికకు అవకాశం ఇచ్చారు. దీంతో హిందుపురం వైసీపీలో వర్గ పోరు మొదలైంది. ఇప్పుడు నవీన్ నిశ్చల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ఇచ్చే ఇదేనా అంటూ కార్యకర్తలు జగన్ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఇక జగన్ జాబితాలో ఇలా మోసపోయిన వ్యక్తి నవీన్ నిశ్చల్ ఒక్కరే కాదు. సొంత చెల్లి షర్మిలతో పాటు చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. వాడుకుని వదిలేయడం జగన్ తీరు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హిందూపురం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ టీడీపీ తప్పా మరో పార్టీ జెండా ఎగరలేదు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 85, 89, 94 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక నందమూరి బాలకృష్ణ 2014, 19, 24 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంతో పాటు హిందూపురంలోనే నోట్ల కట్టల వరద పారించాడు. కానీ బాలకృష్ణ మెజార్టీ రెట్టింపు అయింది.
ఈ లెక్కలు, హిందూపురం అభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేని శ్యామల ఇటీవల.. బాలయ్య మూడు సార్లు గెలిచినా నియోజకవర్గంలో ఏం సాధించారని ప్రశ్నించారు.. ఈ నియోజకవర్గంలో జగన్…. ఇతర నేతలని ఎలా వాడుకుంటున్నారో, వారిని కరివేపాకులా ఎలా విసిరి పారేస్తున్నారో శ్యామలకి తెలియదా..?? తెలుసుకోకుండానే, ఆమె ఇక్కడ అడుగుపెట్టారా..? అని నిలదీస్తున్నారు హిందూపురం వాసులు..











