ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అక్టోబర్ గండం వేధించనుంది. పదిహేను రోజుల తర్వాత వచ్చే అక్టోబర్ నెలను ఎలా ఎదుర్కోవాలా అని రాష్ట్ర ఆర్ధిక శాఖ తర్జన భర్జన పడుతోంది. జీతాలకు, పింఛన్లకు, తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన అసరా పథకానికి అందిన కాడికి అప్పులు తెచ్చి ఆరువేల ఏడువందల కోట్లు సమకూర్చారు. ఆ గండం నుంచి బయట పడ్డామని ఊపిరి పీల్చుకునే లోగా 20 వ తారీఖు దగ్గర పడింది.
మరో పదిరోజులలో జీతాలు, పింఛన్లు, ఇతర అవసరాల కోసం దాదాపు 14 వేల కోట్లు అవసరం అవుతాయి. మరోవైపు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం కూడ అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితులలో ఆర్ధిక భారం నుంచి ఎలా బయటపడాలా అని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి చేతికి ఎముక లేకుండా వరాలు గుప్పిస్తుండడంతో వాటిని ఎలా తీర్చాలా అని ఆర్ధిక శాఖాధికారులు ఆందోళన చెందుతున్నారు.
కేంద్రమే దిక్కు
ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ధికంగా ఆదుకునేది ఒక్క కేంద్ర ప్రభుత్వమే. భారత రిజర్వ్ బ్యాంక్ ద్వారా కొత్తగా అప్పు ఇచ్చే అవకాశాన్ని కేంద్రం కల్పించాలి. కరోనాతో పాటు ఇతర రాబడులు కూడా తగ్గిన కేంద్రం రాష్ట్రాలకు చేయూతనివ్వడం అనేది దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఒకవేళ కేంద్రం ఆర్ బిఐ నుంచి రుణం ఇప్పించినా అది 15 వేల కోట్లకు మించదు అని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆ మొత్తం అక్టోబర్ నెలకు మాత్రమే సరిపోతుందని, ఆ తర్వాత ఎలా నెట్టుకు వస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖాధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇంత తక్కువ వ్యవధిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఒకవేళ ఆర్ బీ ఐ రుణం మంజూరుకు అంగీకరిచకపోతే ఆర్ధిక శాఖ ముందు “ఆఫ్ బడ్జెట్ బారోయింగ్” తప్ప మరో మార్గం లేదు. ఇది కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఏ మూలకూ సరిపోని జీఎస్టీ బకాయిలు
కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు రప్పించుకున్నా అవి ఏ మూలకూ చాలవని అధికారులు అంటున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించమని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తన ఎంపీలకు చెప్పారు. దీని వెనుక జీఎస్టీ బకాయిలు రాబట్టుకోవడంతో పాటు ఇతర వనరులు సమకూర్చుకోవడమే అని అంటున్నారు. ఇందుకోసం పార్లమెంటులో కేంద్రానికి మద్దతు నిలవాలని ముఖ్యమంత్రి తన ఎంపీలకు సూచించారు.
ఢిల్లీకి ఆర్ధిక శాఖ అధికారులు
ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో పాటు ఆర్ధిక శాఖకు చెందిన ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి, వైఎస్ ఆర్ సీపీ ఎంపీలతో పాటు రాష్ట్రం నుంచి వెళ్లే ఆర్ధిక బృందం సభ్యులు కూడా ప్రధానిని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ను, ఆర్బీఐ ఉన్నతాధికారులను కలసి రాష్ట్ర పరిస్థితిని వివరించనున్నారు. తద్వారా సాయం పొందాలని భావిస్తున్నారు.