మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురు కాగా… ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. తాను సీఎంగా ఉండగా… తాను చెప్పినట్లుగా నడిచిన నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ఆయనకు క్రమంగా దూరం జరుగుతున్నారు. అంతేకాకుండా జగన్ సీఎంగా ఉండగా తాము పాల్పడ్డ దురాగతాలన్నీ కూడా తమకు తాముగా చేసినవి కావని, వైసీపీ అధిష్ఠానం నుంచి అందిన ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని చెబుతూ జగన్ తో పాటు వైసీపీ కీలక నేతలను అడ్డంగా బుక్ చేసేందుకు కూడా వారు ెనుకాడం లేదు. జగన్ కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించిన జోగి రమేశ్ ఇప్పుడు ఈ బాటలోనే సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని జోగి ముఖ్య అనుచరులు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తున్న వైనం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైసీపీ ఓటమి తర్వాత జగన్ కు ఆయన దగ్గరి బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వదిలి వెళ్లారు. రాజకీయంగా పెను ప్రభావం చూపుతున్న ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బాలినేని… చాలా రోజుల నుంచి పార్టీని వీడతారని ప్రచారం జరిగినా…ఎన్నికల దాకా ఆయనను జగన్ అండ్ కో ఎలాగోలా నిలువరించారు. అయితే ఎన్నికల్లో ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురు కాగానే.. బాలినేనిని నిలువరించడం జగన్ వల్ల కూడా కాలేదు. తాను అనుకున్నట్లుగానే వైసీపీకి హ్యాండిచ్చేసిన బాలినేని నేరుగా వెళ్లి జనసేనలో చేరిపోయారు. ఇక తాజాగా వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా కొనసాగిన కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కూడా ఇటీవలే వైసీపీని వీడారు. బాలినేని జగన్ కు బంధువు అయితే… సామినేని జగన్ ఫ్యామిలీకి ఆత్మ బంధువులాంటి వారు. అలాంటతి వారే పార్టీని వీడటంతో జగన్ డీలా పడిపోయారు.
తాజాగా సామినేని మాదిరే వైసీపీకి… ప్రత్యేకించి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా కొనసాగిన మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా బాలినేని,సామినేని బాటలోనే పయనించేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉండగా.. కృష్ణా జిల్లాలో కీలక నేతగా జోగి వ్యవహరించారు. జగన్ ను ఎవరేమన్నా కూడా క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయే నైజం జోగిది. ఆ క్రమంలోనే గతంలో వైసీపీ జమానాలో నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి యత్నించారు. నాడు కేవలం ఎమ్మెల్యేగానే ఉన్న జోగి… మందీమార్బలాన్ని వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపైకి దండెత్తే యత్నం చేశారు. అయితే నాడు టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న ఎదురొడ్డి మరీ జోగి అండ్ కోను అడ్డుకున్నారు. ఈ ఘటన తర్వాతే జోగికి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కడం గమనార్హం.
అయినా ఇప్పుడు జోగి రమేశ్ పార్టీ మారే దిశగా సాగుతుండటానికి గల కారణాలు ఏమిటన్న విషయంలోకి వెళితే… పలు ఆసక్తికర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం కేసులో ఇప్పటికే జోగిని పోలీసులు పలుమార్లు విచారించారు. విచారణ సందర్భంగా తన ఫోన్ ను పోలీసులకు అప్పగించేందుకు జోగి ససేమిరా అన్నారు. ఈ కేసులో జోగి త్వరలోనే అరెస్ట్ అవడం ఖాయంగానే కనిపిస్తోంది. మరోైపు అగ్రిగోల్డ్ భూముల క్రయిక్రయాల కేసులో అడ్డంగా బుక్కైన .జోగి కుమారుడు రాజీవ్ అరెస్ట్ కాగా… ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఈ రెండు కేసులు జోగిని తీవ్ర కలవరపాటుకు గుచి చేశాయట.
అయితే ఇలాంటి ఆపత్కాలంలో పార్టీ నుంచి గానీ, జగన్ నుంచి గానీ తనకు భరోసా దక్కలేదని జోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడే పరిస్థితి ఇలా ుంటే… రేపు తాను అరెస్ట్ అయినా, తన కుటుంబం మరింత ఇబ్బంది పడినా వైసీపీ తమను పట్టించుకోదన్న అంచనాకు జోగి వచ్చేశారట. ఈ కారణంగానే ఆయన వైసీపీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారట. వైసీపీని త్వరలోనే వీడనున్న జోగి బాలినేని, సామినేని మాదిరే జనసేనలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.











