ఏపీలో ఎన్నికలకు మరో నాలుగేళ్ల టైం ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. కూటమి సర్కార్ పాలన పట్ల ప్రజలు సైతం సంతృప్తిగానే ఉన్నారు. ఐతే ఏపీలో మళ్లీ 2029లోనే ఎన్నికలు జరగనున్నాయి. 2029 ఎన్నికలు ఏపీ భవిష్యత్ Vs వైసీపీ భవితవ్యం అనే రీతిలో సాగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీగా సాగిన ఎన్నికలు ఇకపై ఏపీ వర్సెస్ వైసీపీగా జరిగే అవకాశం ఉంది.
2019 – 24 మధ్య వైసీపీ పాలన ఏపీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. విభజన వల్ల ఏర్పడిన బాధ కంటే జగన్ చేసిన గాయమే ఇప్పుడు ఏపీ ప్రజలను భయపెడుతోంది. అధికారం చేపట్టిన వెంటనే ప్రజా వేదిక విధ్వంసంతో పాలనను మొదలుపెట్టిన జగన్..ఐదేళ్ల పాటు విధ్వంసాన్ని కొనసాగించారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేసి ఏపీకి తీరని నష్టాన్ని చేశారు జగన్.
కేవలం ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ, అమరావతి ప్రాంతాన్ని అడవిగా మార్చారు. ఈ ఒక్క నిర్ణయంతో ఐదేళ్ల పాటు దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అపకీర్తి మూటగట్టుకుంది. వైసీపీ నేతల అరాచకాలతో పారిశ్రామికవేత్తలు ఏపీలో అడుగుపెట్టేందుకే భయపడ్డారు. వైసీపీ హయాంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. విశాఖకు ఒక్క పరిశ్రమ తెప్పించకపోగా..ఉన్నవాటిని రాష్ట్రం నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కేవలం బటన్లు నొక్కడానికే ప్రభుత్వం పరిమితమైంది. వేలాది మంది వాలంటీర్లు, వందల మంది ప్రజా ప్రతినిధులు, పదుల సంఖ్యలో సలహాదారులను నియమించుకుని జగన్ ఏపీ వినాశానానికి పునాదులు తవ్వారు. ఐతే జగన్ ఐదేళ్ల పాలనను ఓపికగా భరించిన ప్రజలు..2024 ఎన్నికల్లో వైనాట్ 175 అన్న వైసీపీకి 11 అసెంబ్లీ స్థానాలతో ఘోరీ కట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో ఇటుకను పేరుస్తోంది. రాజధాని అమరావతిలో పనులను వేగవంతం చేయడం సహా విశాఖలో ఐటీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. రాయలసీమ జిల్లాలకు సైతం పరిశ్రమలను తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ అభివృద్ధి పరుగులు పెడుతోంది. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది.
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ..వైసీపీ సమీక్షించుకోవడం లేదు. అదే విధ్వంసాన్ని, అరాచకాన్ని కొనసాగిస్తోంది. పరామర్శలు, ఓదార్పుల పేరిట జగన్..వైసీపీ నేతలను రెచ్చగొడుతున్నారు. రప్పా రప్పా అంటూ వీధి రౌడీల తరహాలో నినాదాలు చేస్తున్నారు. జగన్ 2.0 అంటూ పగటి కలలు కంటున్నారు. వైసీపీ వైఖరి ఇలానే కొనసాగితే 2029 ఎన్నికలు ఏపీ భవిష్యత్ Vs వైసీపీ భవితవ్యం అనే నినాదంతో సాగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.











