పేదల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు, వారి అనుచరులు సంపాదించిన ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా లిక్కర్ స్కామ్ కేసులో A-1గా ఉన్న రాజ్ కసిరెడ్డికి చెందిన రూ.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ACB కోర్టులో ప్రపోజల్స్ దాఖలు చేసింది. ఇందులో 10 కోట్ల వరకూ వివిధ రకాల ఆస్తులు ఉండగా..మరో రూ.3 కోట్లు బ్యాంకులో నగదు రూపంలో ఉన్నాయి. ఇవన్నీ లిక్కర్ స్కామ్లో భాగంగా వచ్చిన డబ్బులతో కొన్న ఆస్తులు, నగదేనని నిర్ధారించుకుని.. జప్తు చేయాలని నిర్ణయించారు.
రాజ్ కసిరెడ్డి 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య 7 నెలల్లో హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచంపల్లి, దామర్లపల్లి గ్రామాల్లో తన పేరిట 27.06 ఎకరాలు, తన తల్లి సుభాషిణిరెడ్డి పేరిట 3.14 ఎకరాలు.. మొత్తంగా 30.20 ఎకరాల భూమి కొన్నట్లు సిట్ గుర్తించింది. మార్కెట్ విలువ రూ.35-40 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బులతోనే రాజ్ కసిరెడ్డి ఈ భూముల్ని కొన్నట్లు సిట్ తేల్చింది. నగదు రూపంలోనే వీటి లావాదేవీలు జరిగినట్లు గుర్తించి, ఈ భూముల జప్తునకు చర్యలు చేపట్టింది.
రాజ్ కసిరెడ్డి తన బినామీ కంపెనీ అయిన ఈషాన్వీ ఇన్ఫ్రా పేరిట హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో 2022 జూన్లో 326 చదరపు గజాల స్థలం కొన్నారు. రూ.1.46 కోట్లకు కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చెక్కు,RTGS ద్వారా ఈషాన్వీ ఇన్ఫ్రా నుంచి ఈ మొత్తం చెల్లించినట్లు చూపించారు. దీనిపై సిట్ ఆరా తీయగా..విక్రయదారుకు అసలు ఆ సొమ్ము చెల్లించినట్లే లేదు. దీన్నిబట్టి లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును వైట్లోకి మార్చుకునేందుకు చేసిన లావాదేవీగా సిట్ గుర్తించింది. రాజ్ కసిరెడ్డి తన PA పైలా దిలీప్ (A-30)కి ఆథరైజ్ చేసి, ఈ లావాదేవీ నిర్వహించినట్లు సిట్ తేల్చింది. ఈ స్థలం మార్కెట్ విలువ రూ.10 కోట్ల పైనే ఉంటుంది.
రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో హైదరాబాద్ సమీపంలోని షాబాద్ మండలం మాచంపల్లి, దామర్లపల్లి గ్రామాల్లో తను, తన తల్లి, బినామీ కంపెనీల పేరిట అనేక మంది విక్రయదారుల నుంచి 100 ఎకరాలకు పైగా భూములు కొన్నారు. ఈ క్రమంలోనే కౌశిక్కుమార్ అగర్వాల్ అనే ఓ విక్రయదారుకు తన బినామీ కంపెనీ UNI కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి రాజ్ కసిరెడ్డి రూ.3 కోట్లు పంపించారు. ఇదీ మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో విక్రయదారు ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి పంపించేశారు. ప్రస్తుతం UNI కార్పొరేట్ సొల్యూషన్స్ సంస్థకు సంబంధించి HDFC బ్యాంకు ఖాతాలో ఉన్న ఆ రూ.3 కోట్ల జప్తునకు సిట్ చర్యలు చేపట్టింది.
జప్తు చేసే ఆస్తులు ఇవే –
హైదరాబాద్ చుట్టుపక్కల 30.20 ఎకరాలు, గచ్చిబౌలిలోని 326 చదరపు గజాల స్థలం.. వీటి మార్కెట్ విలువ రూ.50 కోట్లపైనే ఉంటుందని సమాచారం. బినామీ కంపెనీ బ్యాంకు ఖాతాలోని రూ.3 కోట్లు.
లిక్కర్ స్కామ్లో ఇతర నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను కూడా జప్తు చేసేందుకు చర్యలు అధికారులు మొదలు పెట్టనున్నారు. అరెస్టు అయిన నిందితుల్లో మెజార్టీ వ్యక్తులు లిక్కర్ కేసు డబ్బులతో హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు, విల్లాలు కొన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే పలు చోట్ల సోదాలు చేసి.. నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫామ్ హౌస్లో దాచి ఉంచిన రూ. 11 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. త్వరలో లిక్కర్ కేసులో మరిన్నీ కీలకమైన పరిణామాలు ముందు ముందు జరగనున్నాయి.
ఇప్పటికే రెండు చార్జిషీట్లను సిట్ అధికారులు కోర్టులో నమోదు చేశారు. అసలు ప్రదాన సూత్రధారి, ఆయనకు అందిన డబ్బులు, బంగారం గురించి బయటకు తీయాల్సి ఉంది. వాటిపై సిట్ అధికారులు పక్కా సమాచారంతో ఉన్నారని.. సరైన సమయంలో.. ఇవన్నీ బయట పెట్టి బిగ్బాస్ సహా ఇతర ప్రధాన లబ్ధిదారులను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.











