(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి నోరు మెదపడం లేదని, ఈ ఘటనలపై తక్షణమే సీబీఐచే దర్యాప్తు నిర్వహించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రామతీర్థంలో దాడి దురదృష్టకరం
400 సంవత్సరాల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం, ఎంతో పవిత్రమైన స్థలం రామతీర్థం ఆలయంలో దాడి జరగడం, కోదండరాముని శిరస్సును ఖండించడం దురదృష్టకరమని అయ్యన్న ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వరుసగా దేవలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఏడాదిన్నర కాలంలో దేవాలయాలపై 125 దాడులు జరగడం అత్యంత శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి హిందూ మతాన్ని అణగదొక్కాలని చూస్తున్నారా?, ముఖ్యమంత్రి గాని, దేవాదాయశాఖ మంత్రి గాని ఇప్పటికీ స్పందించక పోవడం వెనుక అసలు కారణం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల ఆస్తులను దోచుకునే కార్యక్రమం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో తిరుపతి డబ్బులతో ఆసుపత్రి అభివృద్ధి చేద్దామని ప్రతిపాదిస్తే స్వాములు అంతా గోల చేశారని, ఇప్పుడు వారంతా ఎక్కడకు వెళ్లిపోయారు? ఎందుకు స్వాములు మాట్లాడటం లేదు? స్వాములూ రాజకీయాలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దారుణాలు జరుగుతున్నప్పుడు ధర్మాన్ని కాపాడాల్సిన స్వాములు మౌనంగా ఉండటం వెనుక అసలు కారణాలు ప్రజలకు తెలియాలన్నారు. దాడుల పై స్వాములు, ప్రభుత్వం స్పందించలేదు అంటే వీరు అంతా కుమ్మక్కయ్యారా అనే అనుమానం కలుగుతోందన్నారు. విజయనగరం వచ్చిన ముఖ్యమంత్రి కూడా రామతీర్థం ఘటనపై స్పందించక పోవడం దారుణమన్నారు. ఈ విషయంలో జగన్కు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో దొంగల రాజ్యం
రాష్ట్రంలో దొంగల రాజ్యం సాగుతోందని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద దొంగ, ఉత్తరాంధ్రలో చిన్న దొంగ పాలిస్తున్నారని, ఇది ప్రజల దౌర్భాగ్యమని ఎద్దేవాచేశారు. జగన్కి హిందూ ధర్మమన్నా, హిందు మతమన్నా పడదన్నారు. హిందుత్వం బ్రతకాలంటే తామే ఉండాలంటున్న బీజేపీ నేతలు కూడా ఎందుకు ఈ దాడులపై స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ , వైసీపీ కుమ్మక్కయ్యా? అవగాహన రాజకీయాలు చేస్తున్నారా? అని అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సోము వీర్రాజు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
సిగ్గు చేటు
రామతీర్ధాలు ఘటన వెనుక టీడీపీ కుట్ర ఉందని స్థానిక నేతలు ఆరోపించడం సిగ్గుచేటని అయ్యన్న అన్నారు. ఆనందంగా ఉన్న అశోక్ వనంలో సంచైత గంజాయి మొక్కలా తయారైందని ఎద్దేవా చేశారు. మాన్సాస్ ఆస్తులు దోచుకోడానికి ప్రభుత్వ దొంగలు అడ్డదారిలో సంచైతను తీరుసుకురావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుని ఓడించిన ఘనత రాష్ట్ర ప్రజలదని, పదవులు శాశ్వతం కాదు..సేవలు గొప్పవని అన్నారు. పశ్చిమ బెంగాల్లో ఒక సంఘటన జరిగితే అక్కడ ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మరి ఏపీలో ఆ పరిస్థితి ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని దేవాలయాలపై దాడులు జరిగితే ఏపీ డీజీపీ పై మోడీ ఎందుకు చర్యలు తీసుకోరని, ఏపీ డీజీపీని తక్షణమే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని, ఇలాంటి ముఖ్యమంత్రిని ఇదే చూడటమని అన్నారు. పాలన చేతకాని ముఖ్యమంత్రియని, ఎవ్వరి మాటా వినకుండా ఏకపక్షంగా వెళ్తున్న ఈయనకు సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. బెయిల్పై జైలు నుండి బయటకు వచ్చి నీతులు చెప్తున్న ముఖ్యమంత్రిని భరించాల్సిన దౌర్భాగ్యం ఏపీ ప్రజలకు వచ్చిందన్నారు.
బాధాకరం : అశోకగజపతి
రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, దేవాలయాలపై, దేవతామూర్తులపై దాడులు, రామతీర్థం లాంటి పరమ పుణ్యక్షేత్రంలో కోదండరాముని శిరస్సును ఖండించడం బాధను కలిగిస్తోందని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో హిందూ మతంపైనా, రాజ్యాంగం పైనా దాడులు జరుగుతున్నాయన్నారు. అన్ని మతాలను మనం గౌరవించాలి కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదన్నారు. రామతీర్థం పుణ్యస్థలంలో ద్వాపర యుగంలో సీతారాములు, తదుపరి యుగంలో పాండవులు సంచరించినట్లు తెలుస్తోందని, అంతట ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. ఈ చరిత్ర ఆధారంగా నాలుగు వందల ఏళ్లుగా ఆ పవిత్రత కాపాడుతూ వస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదని దేవాలయాలు, ట్రస్టుల ఆస్తులు కాజేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని, అవసరమైన సమయంలో బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.











