(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కరోనా వైరస్ భయం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమయంలో.. అన్ని రాష్ట్రాలూ దీపావళి టపాసుల విక్రయాలను నిషేధించడమే మంచిదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఎన్జీవోలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గ్రీన్ దీపావళి జరుపుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇటువంటి సమయంలో టపాసులు నుంచి వచ్చే వాయువుల వల్ల ఇప్పటికీ వైరస్ బారిన పడిన రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ రెండింటి ప్రభావం ఊపిరితిత్తుల పైనే..
టపాసుల నుంచి వెలువడే పొగ, కరోనా వైరస్ ఈ రెండు ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతాయి. దానివల్ల వైరస్ బారిన పడిన రోగులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఊపిరితిత్తుల నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్న పిల్లలు కూడా వీలైనంత మటుకు క్రాకర్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
లక్షణాలు లేని కేసులే అధికం..
కరోనా వైరస్ బారిన పడిన వారిలో 95 శాతం మందిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. వారి శరీరంలో వైరస్ ఉన్న విషయం పరీక్ష చేస్తే గాని బహిర్గతం కావడం లేదు. ఇటువంటి సమయంలో టపాసుల నుంచి వెలువడే కెమికల్స్ తో కూడిన వాయువులు పీల్చడం వల్ల, అప్పటికే శరీరంలో వున్న వైరస్కు తోడయ్యి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని విశాఖ లోని ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు.
హెచ్చరిస్తున్న కేంద్ర ప్రభుత్వం..
ఇదే సమయంలో కేంద్రం.. అన్ని రాష్ట్రాలతో సమీక్ష సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తోంది. పండగల సందర్భంగా జాగ్రత్తలు తీసుకోండి అని సూచనలు ఇస్తోంది. దేశంలో కరోనా తగ్గినట్టే కనిపిస్తున్నా ప్రతి రోజూ వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో సెకండ్ వేవ్ ప్రారంభమైందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వరుసగా పండుగలు రావడం, లాక్ డౌన్ ఎత్తివేయడంతో కరోనా మరోసారి ప్రతాపం చూపే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం … రాష్ట్రాలను హెచ్చరించింది. ఇప్పటికే ఢిల్లీలో దీపావళి టపాసుల అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీపావళి టపాసుల అమ్మకాలను నిషేధించే దిశగా అడుగులు వేయాలని ఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని పండుగలు నిరాడంబరంగా చేసుకున్నప్పుడు… కరోనా వైరస్ బారిన పడిన వారిని అత్యంత ఇబ్బందులకు గురి చేసే దీపావళి కి దూరంగా ఉండాలని మెజారిటీ వర్గాలు కోరుతున్నాయి.