వైసీపీ హయాంలో జరిగిన ఒక్కొక్క కుంభకోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు వేల కోట్లు దండుకున్న విషయం సంచలనంగా మారగా..తాజాగా ఇసుక తవ్వకాల్లోనూ పెద్ద ఎత్తున దోచుకున్నారని తేలింది. దాదాపు రూ.1,860 కోట్లను అక్రమంగా ఇసుకను తవ్వడం ద్వారా దోచుకున్నట్లు సమాచారం. మొదట ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను చేయించి..అది విఫలమైందంటూ ఓ కాంట్రాక్టు సంస్థకు ఆ వ్యాపారం కట్టబెట్టింది వైసీపీ సర్కార్. తర్వాత వైసీపీ నేతలు నేరుగా ఎంట్రీ ఇచ్చి..జిల్లాల్లో సిండికేట్లుగా ఏర్పడి నదులు, వాగులు, వంకలను పూర్తిగా ఉడ్చేశారు. ఇక ఈ దందాలోనూ బిగ్బాస్కు భారీగానే సొమ్ము అందినట్లు తెలుస్తోంది.
ఇసుక దోపిడీపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..ఎంతమేర తవ్వకాలు జరిగాయో తేల్చాలని ఆదేశించింది. ఆ అక్రమాల లెక్కలను నిగ్గుతేల్చేందుకు గనులశాఖ అధికారులు.. ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సాయం తీసుకున్నారు. ఇప్పటివరకు 3,91,73,400 మెట్రిక్ టన్నుల ఇసుకను అనుమతుల్లేని రీచ్ల నుంచి తవ్వి తరలించినట్లు బయటపడింది. అప్పట్లో టన్ను ఇసుకను రూ.475కు విక్రయించారు. ఆ లెక్కన దోపిడీ విలువ రూ.1,860 కోట్లు.
రాష్ట్రవ్యాప్తంగా 2021 మే నుంచి 2024 మే వరకు ఎన్ని రీచ్లకు అనుమతులిచ్చారనే వివరాలను ఏపీశాక్కు గనులశాఖ అందించింది. ఇవి కాకుండా అక్రమ తవ్వకాలు భారీగానే ఉన్నట్లు ఏపీశాక్ గుర్తించింది..ఆయా సంవత్సరాల్లో నెలల వారీగా శాటిలైట్ ఇమేజెస్ తీసి, జీడీ స్టీరియో డేటా, 2డీ గూగుల్ ఎర్త్ప్రో ఇమేజ్లన్నీ పరిశీలించింది. ఆ ప్రాంతాల్లో గతంలో ఎలా ఉంది.? తవ్వకాలు జరిపిన మూడేళ్లలో ఏం జరిగిందో చూసింది. పెద్దఎత్తున ఇసుక తవ్వినట్లు బయటపడింది.
రాష్ట్రంలో మొత్తం 19 జిల్లాల్లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నదుల్లో 709 చోట్ల దందాకు పాల్పడ్డారని నిర్ధారించారు. 2 వేల 611 హెక్టార్లలో అనుమతుల్లేకుండా తవ్వేశారు. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 21 చోట్ల 54.73 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఊడ్చేశారు.మాజీ సీఎం జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడప జిల్లాలోనూ 69 చోట్ల 47.37 లక్షల మెట్రిక్ టన్నుల్ని తవ్వి, సొమ్ము చేసుకున్నారు.గుంటూరు జిల్లాలో 69 చోట్ల తవ్వేసి.. 44.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించారు.నెల్లూరు జిల్లాలో 34.16 లక్షలు, ఎన్టీఆర్ జిల్లాలో 33.97 లక్షలు, కృష్ణా జిల్లాలో 33.97 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 22.70 లక్షల మెట్రిక్ టన్నుల మేర దోపిడీ సాగింది.
కుట్రకు ఎలా తెర లేపారంటే –
వైసీపీ ప్రభుత్వంలో 2019 సెప్టెంబరు నుంచి 2021 మే వరకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక వ్యాపారం చేసింది. ఇలాగైతే తమకు ప్రయోజనం ఉండదని భావించిన ప్రభుత్వ పెద్దలు.. ప్లాన్ మార్చారు. బిగ్బాస్ ప్లాన్ ప్రకారం ఇసుకపై మంత్రుల కమిటీని నియమించారు.APMDC ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో విఫలమవుతోందని, కేంద్ర సంస్థకు కానీ, ప్రైవేటు సంస్థకు కానీ ఇసుక వ్యాపారాన్ని అప్పగించాలని మంత్రుల కమిటీ ద్వారా సిఫారసు చేయించారు. రాష్ట్రమంతా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఉత్తరాదికి చెందిన జేపీ సంస్థకు టెండర్లు కట్టబెట్టి 2021 మేలో ఇసుక వ్యాపారాన్ని అప్పగించారు. టెండర్ల సమయంలో తమిళనాడుకు చెందిన ఇసుక వ్యాపారి టర్న్కీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను ఏర్పాటు చేయగా.. దానిని ఉపగుత్తేదారుగా రంగంలోకి దించారు.
2021 మే నుంచి 2022 ఆగస్టు వరకు ఆ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేసింది. 2022 ఆగస్టులో టర్న్కీ సంస్థను వెళ్లగొట్టి, వైసీపీ నేతలే ఇసుక వ్యాపారం ఆరంభించారు. జిల్లాల వారీగా ఎవరు ఎక్కువ సొమ్ము చెల్లిస్తే..వాళ్లకు వ్యాపారం అప్పగించారు. ఇలా జిల్లాకో సిండికేట్ ఏర్పాటైంది. వీరంతా ఇష్టానుసారం తవ్వి దోపిడీకి పాల్పడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే అప్పటి సీఎం కార్యాలయ అధికారులే నేరుగా జోక్యం చేసుకునేవారు. 2021 నుంచి 2024 వరకు ఎంత మేర తవ్వారనే లెక్కలు లేవు. లిక్కర్ స్కామ్ తరహాలోనే ఇక్కడ కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించకుండా నగదు తీసుకొని ఇసుకను లోడ్ చేసేవారు.
అక్రమ తవ్వకాలపై దండా నాగేంద్రకుమార్ అనే వ్యక్తి వరుస ఫిర్యాదులతో జాతీయ హరిత ట్రైబ్యునల్(NGT), సుప్రీంకోర్టుల్లో కేసులు నమోదయ్యాయి.అప్పటి గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి…కలెక్టర్ల చేత రీచ్ల్లో మొక్కుబడి తనిఖీలు చేయించారు. అక్రమ తవ్వకాల్లేవంటూ నివేదికలు తయారుచేయించి NGT, సుప్రీంకోర్టులకు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక..వైసీపీ హయాంలో జరిగిన ఇసుక దోపిడీపై విచారణ చేయించడంతో అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి.
ఇప్పుడు ఏపీశాక్ నివేదిక ఆధారంగా జిల్లాల వారీగా ఇసుక గుత్తేదారులకు గనుల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి వివరణ కోరుతున్నారు. ఆ తర్వాత జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులివ్వనున్నారు. కొంతకాలం కిందట 13 చోట్ల గుత్తేదారు సంస్థలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరికొన్ని చోట్ల ఫిర్యాదులు అందుతున్నాయి. ఏపీశాక్ సాయంతో సిద్ధంచేసిన నివేదికను గనులశాఖ అధికారులు వచ్చేనెల మొదటి వారంలో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. పూర్తిస్థాయి నివేదికను అందించేందుకు మరికొంత సమయం కోరనున్నట్లు తెలుస్తోంది.











