ఈ ఏడాది ఐపీఎల్లో మరో ఆసక్తికర మ్యాచ్కు తెరలేవనుంది. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీ సేనల మధ్య ఈ సీజన్లో తొలి మ్యాచ్కు రంగం సిద్ధమవుతోంది. గత టోర్నీల్లో ఎప్పుడూ బెంగళూరు కంటే చెన్నై జట్టే మెరుగ్గా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ధోనీ సేన కంటే కోహ్లీ టీమ్ కాస్త మెరుగైన పరిస్థితిలో ఉంది. ఈరోజు (శనివారం) రాత్రి 7:30 గంటలకు ఈ రెండు టీమ్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
ఈ సీజన్లో బెంగళూరు ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడి మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక, చెన్నై ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొంది ఆరో స్థానంలో ఉంది. ఈ రెండు టీమ్లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు (శనివారం) రాత్రి 7:30 గంటలకు తలపడబోతున్నాయి. మరి, ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
బెంగళూరు టీమ్ బలాలు
ఈ సీజన్లో కోహ్లీ సేన మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. గత టోర్నీల్లో ఎన్నడూ లేని రీతిలో సానుకూలంగా ఆడుతోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడి మూడింట్లో గెలిచింది. బెంగళూరు టీమ్కు ఓపెనింగ్ జోడీ అతిపెద్ద బలంగా మారింది. దేవదత్ పడిక్కళ్, అరోన్ ఫించ్ లెఫ్ట్-రైట్ కాంబినేషన్తో అదరగొడుతున్నారు. పవర్ ప్లే ముగిసే లోపే భారీ పరుగులు సాధించి భారీ స్కోరుకు బాటలు వేస్తున్నారు. ఆ తర్వాత కోహ్లీ, డివిల్లియర్స్, శివం దూబే అవకాశాలను అందిపుచ్చుకుని భారీ స్కోరు సాధిస్తున్నారు. క్రిష్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ రూపంలో నాణ్యమైన ఆల్ రౌండర్లు కీలక ఆటగాళ్లుగా మారారు. బౌలింగ్ విభాగం కూడా ఫర్వాలేదనిపిస్తోంది.
బలహీనతలు
వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగళూరు టీమ్కు గత మ్యాచ్లో ఢిల్లీ బ్రేకులు వేసింది. బెంగళూరు సామర్థ్యంపై సందేహాలు రేకెత్తించింది. గత మ్యాచ్లో కోహ్లీ తప్ప మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ నిరాశపరిచారు. ఫలితంగా 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్ పరాజయాన్ని గుణపాఠంగా స్వీకరించి లోపాలు సరిదిద్దుకోకపోతే కోహ్లీ టీమ్కు కష్టాలు తప్పవు. బెంగళూరు ఫీల్డింగ్ అత్యంత పేలవంగా ఉంది.
బెంగళూరు టీమ్ (అంచనా)
దేవదత్ పడిక్కళ్, ఆరోన్ ఫించ్, కోహ్లీ, డివిల్లియర్స్, శివం దూబే, మోరిస్, వాషింగ్టన్ సుందర్, ఉడాన, నవదీప్ షైనీ, సిరాజ్, చాహల్.
చెన్నై టీమ్ బలాలు
చెన్నై టీమ్లో వాట్సన్, డుప్లెసిస్, రాయుడు, ధోనీ వంటి అంతర్జాతీయ స్థాయి బ్యాట్స్మెన్ ఉన్నారు. వారు రాణిస్తే చెన్నై టీమ్కు తిరుగుండదు. ఇటీవల పంజాబ్తో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చెన్నై టీమ్ ఛేదించింది. అలాగే డ్వేన్ బ్రావో, జడేజా వంటి ఆల్ రౌండర్లు, సామ్ కర్రన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి బౌలర్లు ఉన్నారు. కావాల్సిందల్లా వారందరూ కలిసి కట్టుగా ఆడటమే. పాయింట్ల పట్టికలో ఇప్పుడు ఆరో స్థానంలో ఉన్న చెన్నై టీమ్ ఇప్పటి నుంచైనా మెరుగైన ప్రదర్శన చేస్తే ప్లే ఆఫ్స్కు చేరడం కష్టం కాదు.
బలహీనతలు
చెన్నై టీమ్కు కేదార్ జాదవ్ అతి పెద్ద బలహీనతగా మారాడు. రూ. 7.8 కోట్లు పెట్టి కొనుకున్న జాదవ్ కనీస స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. గత మ్యాచ్లో జాదవ్ ఆటతీరు చెన్నై ఫ్యాన్స్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇక, కెప్టెన్ ధోనీ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఒకవైపు బ్యాట్స్మెన్గా విఫలమవుతున్నాడు. మరోవైపు కెప్టెన్గా తన ముద్ర వేయలేకపోతున్నాడు. బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ బ్యాట్స్మెన్ మాత్రం బాగా నిరాశపరుస్తున్నారు. ఓపెనర్లు రాణిస్తేనే చెన్నై టీమ్ గెలవగలుగుతోంది. మిడిలార్డర్ దారుణంగా విఫలమవుతోంది.
చెన్నై టీమ్ (అంచనా)
షేన్ వాట్సన్, అంబటి రాయుడు, డుప్లెసిస్, ధోనీ, సామ్ కర్రన్, కేదార్ జాదవ్, బ్రావో, జడేజా, కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.
మ్యాచ్ ఫేవరెట్
ఈ మ్యాచ్లో బెంగళూరు టీమ్నే ఫేవరెట్ అని చెప్పాలి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో చెన్నై కంటే మెరుగ్గా కనబడుతోంది. తమ లోపాలను అధిగమంచి సమష్టి ప్రదర్శన చేయగలిగితేనే బెంగళూరును చెన్నై నిలువరించగలదు.