బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. ఓ దశలో భారత్, మరోదశలో ఆసీస్.. ఇలా ఎవరిదైన శైలీలో రాణిస్తున్నారు. వీరి ఆటకు వర్షం సైతం తోడైంది. చివరి సెషన్ మొత్తం వరుణుడే ఆడేసుకున్నాడు. రెండోరోజు భారత్ కు గడ్డు పరిస్థితే కనిపించింది. అయితే… కష్టకాలంలో ఉన్న టీమిండియాను శార్దుల్, సుందర్ ఆదుకున్నారు. ఆసీస్ భారీ స్కోరుకు గండి కొట్టారు. తమదైన శైలిలో ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. పడి లేస్తూ.. లేచి పడుతూ.. చివరికైతే ఆసీస్ స్వల్ప ఆధిక్యం సాధించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 336 పరుగుల వద్ద ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ 67, వాషింగ్టన్ సుందర్ 62, రోహిత్ శర్మ 44, అగర్వాల్ 38 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్ 5 వికెట్లతో భారత్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. లియోన్ ఓ వికెట్ తో సరిపెట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 33 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 21/0తో ఉంది. ప్రస్తుతం ఆసీస్ 55 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆ ఇద్దరూ ఆదుకున్నారు..
ఆసీస్ గడ్డపై భారత్ ఘోర పరాజయం తప్పదేమీ అనిపించింది. 186 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోవడం క్రీడాభిమానులను నిరాశ పరిచింది. అప్పుడే శార్దుల్, సుందర్ రంగంలోకి దిగారు. బౌలర్లే కదా.. వచ్చిన వెంటనే బయటికి పంపేయొచ్చనే భావన ఆసీస్ బౌలర్లలో కనిపించింది. కానీ వారి ఆశలపై వీళ్లిద్దరూ నీళ్లు చల్లారు. వీరిద్దరూ రెండో సెషన్ పూర్తయ్యేవరకూ మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. అప్పటికి జట్టు స్కోర్ 253/6కి చేరింది.
ఈ క్రమంలోనే టీ విరామం తర్వాత మరింత రెచ్చిపోయిన శార్దూల్, సుందర్ ఆస్ట్రేలియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ అర్ధశతకాలతో ఏడో వికెట్కు శతక భాగస్వామ్యం జోడించారు. చివరికి జట్టు స్కోర్ 309 పరుగుల వద్ద కమిన్స్.. శార్దూల్ను బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. తర్వాత సైని(5), సుందర్(62), సిరాజ్(13) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఫలితంగా.. టీమ్ఇండియా 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది.
శార్దూల్, సుందర్లపై ప్రశంసల వర్షం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్టు మొదటి ఇన్నింగ్స్లో అర్ధసెంచరీలతో ఆకట్టుకున్న లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు శార్దుల్ ఠాకూర్, సుందర్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు తక్కువస్కోరుకే ఔటైనా పట్టుదలగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును మూడోందలు దాటించిన ఈ జోడీపై తోటి క్రీడాకారులు, మాజీల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ వారిపై ప్రశంసల వర్షం కురించారు.