ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు వారాలలోనే మరోసారి ఆయన ఢిల్లీకి వెళుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి చంద్రబాబు హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి.. రేపు కేంద్ర పెద్దలను కలవనున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి.. విభజన సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు కోరతారని అంటున్నారు. అదేకాక, ఇతర రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం మరోసారి బెంగళూరుకు ప్రయాణం అయ్యారు. గత నెల గత నెల 24న అక్కడికి వెళ్లి.. జూలై 1 దాకా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉండి వచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండు వారాలలోనే ప్రయాణం కట్టారు. మరోవైపు, తాడేపల్లిలో తాను నిర్వహించాల్సిన ప్రజా దర్బారును రద్దు చేసి మరీ ఉన్నట్టుండి బెంగళూరుకు వెళ్లిపోయారు. ప్రజా దర్బార్ ను రద్దు చేస్తున్నట్లుగా పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చేసి తన దారిన తాను వెళ్లిపోయారు. నిజానికి పార్టీలో కింది స్థాయి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలవాల్సి ఉంది.
జగన్ ఇలా సడెన్ గా బెంగళూరు వెళ్లిపోవడానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణంగా చెబుతున్నారు. పైగా చంద్రబాబు అమిత్ షాను మాత్రమే కలుస్తున్నట్లుగా ప్రధానంగా వార్తలు వచ్చాయి. అమిత్ షాతో చంద్రబాబు భేటీ అంటేనే జగన్ లో వణుకు పుడుతోంది. వారిద్దరి మధ్య రాజకీయ అంశాలు, ముఖ్యంగా తన గురించి ఎక్కడ చర్చ వస్తుందో అని జగన్ భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. అసలే పుట్టెడు కేసులు జగన్ నెత్తిపైన ఉన్నాయి. గత ఐదేళ్లలో మరెన్నో అవకతవకల కారణంగా ఇంకెన్నో కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. దీంతో తనను జైలు పాలు చేసే కుట్ర ఏమైనా జరుగుతుందేమో అని జగన్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో తాడేపల్లిలో ఉంటే ఏ దర్యాప్తు సంస్థ అధికారులైనా వచ్చి సులభంగా అరెస్టు చేసేందుకు వీలుంటుంది. అదే బెంగళూరులో ఉంటే.. కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాల కారణంగా అక్కడి ప్రభుత్వంపై జగన్ కు నమ్మకం ఉంది. అందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అనగానే జగన్ హుటాహుటిన బెంగళూరుకు పయనం అయ్యారు. చంద్రబాబు గతసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా జగన్ బెంగళూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తనను ఇరికించే కుట్రలేమీ జరగలేదని స్పష్టం చేసుకున్న తర్వాతే జగన్ తాడేపల్లికి వచ్చారు. ఈసారి కూడా అలాగే చేస్తారని అంటున్నారు.