తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ టీడీపీ నేతలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికలపై పలు సూచనలు చేశారు. త్వరలో రాబోతున్నజీహెచ్ఎంసీ ఎన్నికలకు నేతలు సిద్ధం కావాలని క్లాస్ తీసుకున్నారు. డివిజన్ల వారిగా, బూత్ల వారిగా కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రణాళికలతో ఎన్నికల్లో ముందుకుపోవాలని దిశానిర్ధేశం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో టీడీపీ పాత్ర గురించి ప్రజలకు వివరిస్తూ బల్దియా ఎన్నికలకు సిద్ధం కావలని చెప్పారు. టీడీపీ హయాంలో నిర్మించిన సైబరాబాద్ సిటీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, నాడు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. అభివృద్ధి చేసిన చోట ఓటు అడిగే హక్కు టీడీపీకు ఉంటుందని నేతల్లో చంద్రబాబు ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు.
ఈరోజు హైదరాబాద్కు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి సంస్థలు తమ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే దానికి టీడీపీ దూర దృష్టి విధానాలే కారణమన్నారు. హైదరాబాద్ వరదల విషయంలో ప్రజలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికలకు సిద్ధం కావాలని చంద్రబాబు సూచించారు. గ్రేటర్ ఎన్నికలకు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. త్వరలో నియోజకవర్గాల ఇంఛార్జీలను నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేలా కార్యచరణ రూపొందించుకోవాలని శనివారం చంద్రబాబు ఆన్లైన్ సమావేశంలో హైదరాబాద్ టీడీపీ తమ్ముళ్లకు దిశానిర్ధేశం చేశారు.