తాడిపత్రి ఘటనపై వివరణ ఇచ్చుకునేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డిని కలిశారు. తాడిపత్రి ఘటనపై ఆయన సీఎంకు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. ఒక్క సారి ఫ్యాక్షన్ గొడవలు ప్రారంభమైతే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని సీఎం పెద్దారెడ్డికి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఒక వైపు గుడివాడలో మంత్రి కొడాలి నాని అండతో ఆయన అనుచరులు పేకాట శిబిరాలు నిర్వహించడం, మరోవైపు తాడిపత్రి ఘటనతో ప్రభుత్వం పరువు పోయినట్టయింది. దీంతో ఇద్దరు నేతలకు సీఎం క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
అరాచకాలు ఆపండి
తాడిపత్రి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి, తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఘటనల వల్ల పార్టీ పరువు రాష్ట్ర వ్యాప్తంగా పోయే ప్రమాదం ఉండటంతో, నష్ట నివారణ చర్యలు చేపట్టారు. హత్యలు, గొడవలు, ఫ్యాక్షన్తో రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట రక్తపాతం జరుగుతూనే ఉంది. దీనిపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. అసలు ఏపీలో ఏం జరుగుతోందనే విషయాలను కూడా కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయిందనే సమాచారం వస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ నేతలు అరాచకాలు ఆపాలని సీఎం గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది.