(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
యాస్ తుఫాన్నుసమర్థంగా ఎదుర్కొనేందుకు విశాఖలోని కోస్ట్ గార్డ్,ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సన్నద్ధం అయ్యాయి.నాలుగు యుద్ధనౌకలు,11 సరుకు రవాణా విమానాలు,25 హెలికాప్టర్లను సిద్ధం చేసినట్టు నేవీ అధికారులు ప్రకటించారు. అదే విధంగా విశాఖలోని ఐఎన్ఎస్ డేగ వద్ద సిద్ధంగా విమానాలు ఉంచినట్టు అధికారులు తెలిపారు.విశాఖకు రెండు ఎన్డి అర్ ఎఫ్ బృందాలను పంపాలని విపత్తుల శాఖ కమిషనర్ను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కోరారు.కలెక్టరేట్లో 0891- 259010, 0891-2590100 నెంబర్ ఫోన్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
కోస్తా ఆంధ్రాలో గాలులు..
కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో గాలులు,అలల ఉద్ధృతి మినహా దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని,ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు.అయితే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తహసీల్దార్లు,సిబ్బంది మండల కేంద్రాలలో అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్చంద్ ఆదేశించారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.రోడ్ల పై చెట్లు విరిగి పడితే తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.అంబులెన్స్ సర్వీసులకు రోడ్లు క్లియర్ అయ్యేలా చూడాలన్నారు.ఆసుపత్రులలో జనరేటర్లతో విద్యుత్ బ్యాకప్ సిద్ధం చేసుకుని ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.