రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు!
విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఏపీలో నిరుద్యోగ యువత ఉద్యమాల బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి. గ్రూప్-1, గ్రూప్ – 2 పోస్టుల సంఖ్య పెంచాలని, పోలీసు శాఖ పోస్టులు 6500 భర్తీ చేయాలని, కొత్త డీఎస్సీ ప్రకటించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాల డిమాండ్స్ తో అలెర్ట్ అయిన పోలీసులు కలెక్టరేట్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగ యువత కలెక్టర్ కార్యాలయం వద్దకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించారు. జిల్లా కలెక్టరేట్స్ ముట్టడి చేసిన వారిలో పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, టీఎన్ఎన్ఎఫ్, తెలుగునాడు, డివైఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. జిల్లా కలెక్టరేట్ ను ముట్టడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులను, సంఘ నేతలను అరెస్ట్ చేసి, ప్రత్యేక వాహనాలలో తలించారు.
మాటలకే హామీలు పరిమితం!
ఎన్నికల ముందు రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశాయి విద్యార్థి సంఘాలు. అలానే నిరుద్యోగ, విద్యార్థి ఓట్లతో గెలుపొందిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. ఖాళీగా ఉన్న పోస్ట్లు భర్తీ చేస్తానని ఇచ్చిన హామీ నేడు ఏమైందని నిలదీశారు. మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ హామీలు మాటలకే పరిమితం అయ్యాయని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లు కావస్తున్న ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని వాపోయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పటికైనా స్పందించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాల నిరసనలతో రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 13 జిల్లా కలెక్టరేట్స్ ప్రాంగణాలు దద్దరిల్లాయి.
Must Read;-ఏపీ ప్రభుత్వంపై ఫ్యాప్టో ఫైర్! ఆందోళనలు తీవ్ర తరం!!











