ఉద్యోగ సమస్యలు మీరు సృష్టించినవి కాదా?
ఉద్యోగులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. వారంరోజుల్లో సమస్యలన్నీ తీరుస్తామని చెప్పింది మీరు కాదా? అని జగన్, సజ్జలను సూటిగా ప్రశ్నించారు జనసేనాని పవన్! వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్.. నేడు అవి అడుగుతుంటే రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. నేడు ఉద్యోగులు రోడ్డెక్కితే, వారి పక్షాన మాట్లాడిన ఇతర పార్టీలపై విమర్శలు చేయడం సరైంది కాదని హితవు పలికాడు. వైసీపీ నాయకులు ఏం చేసినా, ఏ తప్పులు చేసినా ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు పవన్! లోపాలు ఎత్తిచూపితే.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి నుంచి ఉపాధ్యాయులు వరకు ఎవర్నీ మీరు వదలరా.. ఎదురు దాడి చేస్తారా? అని ఆయన మండి పడ్డారు.
పోరాడుతున్న వారిని వెక్కిరించడం పద్దతికాదు!
రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే ఎవరు మాట్లాడతారని, సమస్యపై పోరాడుతున్న వారిని వెక్కిరించడం మంచి పద్దతి కాదని పవన్ సూచించారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పెద్దలు, మంత్రలు ఉద్యోగులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. మీరు మాట్లాడితే .. దానిని ఆధిపత్య ధోరణి అని నేను బదులిచ్చాను. ముందు మీరు, మీ మంత్రులు, మీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కసారి పరిశీలించుకోండని పవన్ సూచించారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పనులు చేస్తే మాలాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం రాదు కదా అని ఆయన అన్నారు. ఉద్యోగులు కడుపు మండి రోడ్డెక్కి నినదిస్తే.. వారి వ్యాఖ్యలను వక్రీకరించి, మాట్లాడడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన సూచించారు.
Must Read:-వైసీపీ అక్రమాలను ఎండగట్టండి ; చంద్రబాబు