ఇప్పటికే ఒక్కో సచివాలయానికి రూ.35 లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం భవనాలు నిర్మించాలని ఒత్తిడి తెస్తున్నారు. మా వద్ద డబ్బు లేదు. సచివాలయం నిర్మించిన బిల్లులు ఇస్తే రైతు భరోసా కేంద్రం భవనాలు నిర్మిస్తామని కాంట్రాక్టర్లు అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో అధికారులకు పాలుపోవడం లేదట. వైసీపీ అధినేత త్వరలో జైలుకు వెళ్లక తప్పదంటూ వారి పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్టం రాజు రచ్చబండలో చెప్పిన వీడియోలు వైరల్ కావడంతో కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట.
అన్న జైలు కెళితే మనకు బిల్లులు ఎవరిస్తారని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే బిల్లులు విడుదల చేయాలంటూ అధికారులపై కాంట్రాక్టర్లు తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలోనూ హచ్ చల్ చేస్తోంది.
అన్న జైలుకెళితే మాకెవరు దిక్కు
వివిధ నీటి పారుదల ప్రాజెక్టుల పనులు చేస్తున్న బడా కాంట్రాక్టర్లు కూడా పనులు నిలిపివేశారు. ఇంకా రెండు నెలలే. తరవాత అన్న జైలుకే అని వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాంట్రాక్టర్లు వారికి రావాల్సిన బిల్లుల కోసం వెలగపూడి సచివాలయానికి క్యూ కడుతున్నారట. అయితే వారి నుంచి తప్పించుకునేందుకు కొందరు ఉన్నత అధికారులు దొరక్కుండా తప్పించుకుంటున్నారనే సమాచారం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరు వచ్చినా సార్ మీటింగ్లో ఉన్నారని కింది స్థాయి సిబ్బందికి చెప్పి, కొందరు ఉన్నత అధికారులు మొహం చాటేస్తున్నారని తెలుస్తోంది. కొందరు ఉన్నత అధికారులు వెలగపూడి సచివాలయానికి వారానికి ఒకసారి కూడా రావడం లేదట.
పాత బిల్లులు ఇస్తేనే గోతులు పూడుస్తాం..
గుంటూరు, ప్రకాశం జిల్లాల కాంట్రాక్టర్లు మొత్తం ఒక మాట మీదకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే కొత్తగా పనులు చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్టయింది. భవనాల నిర్మాణం అంటే అధికార పార్టీ నేతలకు అప్పగించవచ్చు. కానీ రోడ్లు వేయాలంటే యంత్రాలు కావాలి. తాజాగా ఏపీలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది.
అయితే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదు. దీంతో రోడ్లు, భవనాల శాఖ అధికారులు బిల్డింగ్ వేస్ట్ ను తీసుకువచ్చి రోడ్లపై పడ్డ గోతులు పూడ్చుతున్నాయి. ఇలాంటి ఘటనలు విజయవాడ నగరంలోనే చోటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో వైసీపీ నాయకులపై సెటైర్లు పేలుతున్నాయి. ఇక ట్రోలింగ్స్ సంగతి చెప్పనక్కర లేదు. వీటికితోడు తాజాగా ఏపీ రవాణా శాఖ భారీగా పెంచిన అపరాధ రుసుములు కూడా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి.
మద్యం మానిపించేందుకు వాటి ధరలు పెంచిన ప్రభుత్వం, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకే అపరాధ రుసుములు భారీగా పెంచామని మంత్రిపేర్ని నాని ప్రకటించడం, మరింత దుమారం రేపింది. అయినా వైసీపీ నేతలు ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వ చర్యలపై జనం నవ్వుకుంటున్నా, వైసీపీ నేతలు మాత్రం లైట్ తీసుకోవడంపై కావాలనే అన్నను బదనాం చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











