సిద్దిపేట ఎపిసోడ్లో బీజేపీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. దుబ్బాక పార్టీ అభ్యర్థి రఘునందన్ మామ ఇంట్లో పోలీసుల సోదాలు.. పోలీసుల అనుమానాస్పద వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. నిన్న సాయంత్రం నుండి దుబ్బాక ఉప ఎన్నికల వ్యవహారం మరింత హీటెక్కింది. అయితే టీఆర్ఎస్ తీరును బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అవమానకర రీతిలో అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. కసితీరా టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతోంది.
హుటాహుటిన సిద్దిపేట చేరుకున్న మంత్రి కిషన్ రెడ్డి
రఘునందన్ బంధువుల ఇంట్లో సోదాల విషయం తెలిసిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేటకు వెళ్ళడంతో పోలీసులు ఆయన్ను అరాచకరంగా అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన సిద్దిపేట చేరుకుని రఘునందన్ బంధువుల ఇంటిలో సోదాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన తీరును తెలుసుకుని దాడులు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు వారిపై ఎలాంటి ఫిర్యాదులు చేయాలో జాతీయ నాయకులకు వివరించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.
నేరుగా అమిత్ షా ఎంట్రీ..
పోలీసుల దాడి విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంజయ్ను ఫోన్లో పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. పోరాటానికి ఏ మాత్రం వెనక్కు తగ్గవద్దని చెప్పినట్టుగా సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా హోం మంత్రి సంజయ్కి ఫోన్ చేసి మాట్లాడటం చర్చనీయాంశమయ్యింది. ఈ విషయాన్ని బీజేపీ అంత ఈజీగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ను వెనక్కు తగ్గేలా చేయాలంటే ఇదే చక్కని అవకాశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్పై ఎలా పగ తీర్చుకుంటుంది.. ఈ ఘటనను బేస్ చేసుకుని ఎలాంటి చర్యలకు దిగుతుంది.. సిద్దిపేట పోలీసులపై ఏం చర్యలు తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పోలీసులపై ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం: సంజయ్
తనపై సిద్దిపేట పోలీసులు అకారణంగా దాడి చేసినందున లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని బండి సంజయ్ తెలిపారు. జాతీయ నాయకత్వం కూడా ఆయనకు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో సంజయ్ ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి టీఆర్ఎస్ను ఇరుకున పెట్టనున్నట్లు తెలుస్తోంది.