(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
వివిధ కోవిద్ ఆస్పత్రులలో స్టాఫ్ నర్సులుగా సేవలందించిన వారు ఇప్పుడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దేశంలో కేంద్ర, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రంట్లైన్ వారియర్స్ గా మెడికల్ స్టాఫ్ ను గుర్తిస్తే.. మన రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉంది. చేసిన సేవలకు జీతాలు చెల్లించండి ప్రభూ… అంటూ వేడుకోవాల్సి వస్తోంది.
విశాఖలో శనివారం.. కలెక్టరేట్ వద్దకు భారీ సంఖ్యలో స్టాఫ్ నర్సులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. తాము ప్రథమ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుండగా.. రాత్రి 11 గంటల సమయంలో ఇక విధులకు రానవసరం లేదని అకస్మాత్తుగా చెప్పారని వాపోయారు. ప్రథమ ఆస్పత్రి తో పాటు గీతం, గాయత్రి, మెడికవర్, కేర్ ఆస్పత్రులలో 500 మందికి పైగా పనిచేస్తున్న నర్సులు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు.
వాస్తవానికి స్టాఫ్ నర్స్లకు నెలకు 24,000, టెక్నీషియన్కు 23,000 రూపాయలను జీతంగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. నాలుగు నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించక పోగా, రాత్రికి రాత్రే విధుల నుంచి తప్పించడం తో ఏం చేయాలో పాలు పోక కలెక్టర్కు తమ గోడు వినిపించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా హాస్టల్ లో ప్రతి నెలా డబ్బులు చెల్లించి చివరికి అప్పుల పాలయ్యారు. విశాఖలో కేసులు తగ్గుముఖం పట్టడంతో అనేక ఆసుపత్రులలో ఇన్ పేషెంట్ లు కూడా రావడం లేదు. దీంతో అత్యవసర సమయంలో నియమించిన వీరందరినీ అకస్మాత్తుగా తొలగించారు. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయితే మమ్మల్ని ఎలా పిలుస్తారని బాధితులంతా ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులు వద్దని వారిస్తున్నా.. ప్రాణాలకు తెగించి మరీ వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 12 గంటల పాటు విధులు నిర్వహించడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతిందని వాపోయారు. ఏదేమైనప్పటికీ తమకు తక్షణమే జీతాలు చెల్లించి యథావిధిగా విధులలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.
పట్టించుకోని కలెక్టర్…
తమ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ వద్దకు వెళితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని.. స్టాఫ్ నర్సుల ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న రమా దేవి తెలిపారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న అప్పటి పరిస్థితులలో నర్సుల నియామకం జరిగిందని.. ప్రస్తుతం ఇక అవసరం లేదని చెప్పి కలెక్టర్ వినయ్ చంద్ వెళ్లిపోయారన్నారు. ఈ నేపథ్యంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని రమాదేవి తెలిపారు.