స్టార్ హీరో, క్రేజీ హీరోయిన్ జోడీకి ఎప్పుడూ రిపీట్ వేల్యూ ఉంటుంది. ఎన్నిసార్లు వారిద్దరూ ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసినా.. అభిమానులకు బోర్ కొట్టదు. ఒకప్పటి సినిమాలలో ఈ ధోరణి బాగా కనిపించేది. ఈ జెనరేషన్ లో కూడా రిపీటెడ్ జోడీలను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ తరహాలో కొన్ని క్రేజీ పెయిర్స్ రెండో సారి ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సారి లిస్ట్ లో సీనియర్స్ తో సహా .. అప్ కమింగ్ హీరోలు కూడా ఉన్నారు.
కాజల్ తో మళ్ళీ మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీనెంబర్ 150’ ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పదేళ్ళ గ్యాప్ ఇచ్చినా.. చిరు స్టైలాఫ్ యాక్టింగ్ కు, ఆయన డ్యాన్సులకు ఏ మాత్రం మార్పులేదని ఈ సినిమా చాటి చెప్పింది. అయితే ఇందులో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ కాజల్ తో చిరు ఓ రేంజ్ లో ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ పండించారు. చందమామ కథానాయికగా నటించడం నిజంగా ఆ సినిమాకి అదనపు ఆకర్షణ అయింది. అందుకే ఆమె ప్రెజెన్స్ ను చిరు మళ్లీ కోరుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య లో కథానాయికగా కాజల్ అగర్వాల్ ను ఎంపికచేయడం అభిమానుల్ని భలేగా ఖుషీ చేస్తోంది. మరోసారి ఆ ఇద్దరి రొమాన్స్ సినిమాకి హైలైట్ కానుంది.
అంజలితో రెండోసారి బాలయ్య
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్స్ అవడంతో అభిమానులు ఇప్పుడు హ్యాట్రిక్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఇందులో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కాగా అందులో ఒక పాత్ర అఘోరా అని తెలుస్తోంది. ఇక ఇందులోని మరో పాత్రకు జోడీగా అందాల అంజలిని బోయపాటి ఎంపిక చేశాడట. ఆల్రెడీ అంజలి బాలయ్యతో గతంలో ‘డిక్టేటర్’ సినిమాలో నటించింది. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య ,అంజలి కాంబోకి మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా బాలకృష్ణ కి జోడీగా అంజలి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు.
రిపీట్ కానున్న ‘ఎఫ్ 2’ జంటలు
లాస్టియర్ సంక్రాంతి చిత్రాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘ఎఫ్ 2’ మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ హీరోలుగా నటించిన ఈ సినిమా హిలేరియస్ కామెడీ తో ప్రేక్షకుల్ని భలేగా ఎంటర్ టైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ను ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళేందుకు రెడీ అవుతోంది. అయితే మొదటి భాగంలో జంటలు గా నటించిన తమన్నా, మెహ్రీన్ లు రెండో భాగంలో కూడా కథానాయికలుగా నటించబోతున్నారు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ రెండో సారి రొమాన్స్ కు రెడీ అవనుండడం విశేషంగా మారింది. ఎఫ్ 3 టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా ఈ సారి ఏ మోతాదులో నవ్వుల్ని పూయిస్తుందో చూడాలి.
పవర్ స్టార్ తో రెండో సారి కీర్తి సురేశ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వస్తోన్న ఈ సినిమా తో పాటు.. మరో సినిమాను కూడా ట్రాక్ లో పెట్టాడు పవన్. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాకి విరూపాక్ష అనే వెరైటీ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. చారిత్రక నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లో పవన్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ జోడీ ఇంతకు ముందు త్రివిక్రమ్ అజ్ఞాతవాసి లో నటించిన సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ ఇధ్దరి జోడీకి మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరూ రెండోసారి రొమాన్స్ కు సిద్ధపడుతున్నారు.
మరి ఈ పెయిర్స్ అన్నీ హిట్ పెయిర్స్ గా మారతాయేమో చూడాలి!