స్వామి అగ్నివేశ్ ఇకలేరు. జీవితాంతం ప్రశ్నించే గొంతుకగా నిలిచిన ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. తమ గొంతుక వినిపించేదెవరూ అంటూ దేశ వ్యాప్తంగా రోదనలు మిన్నంటాయి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఐఎల్ బీఎస్ లో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజుల కిందట ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. శుక్రవారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో అగ్నివేశ్ మరణించారని వైద్యులు ప్రకటించడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.
1939 సెప్టెంబరు 21న శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేపా శ్యామ్ రావు. చురుకైన విద్యార్థిగా పేరు ఉన్న ఆయన లా, కామర్స్ అంశాల్లో పట్టా అందుకున్నారు. కోలకతాలో ఆయన కామర్స్ అధ్యాపకుడిగా పని చేశారు. ఆ వృత్తి నచ్చని ఆయన ప్రముఖ న్యాయవాది సవ్యసాచి ముఖర్జీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా చేరారు. కోలకతాలో ఉండటంతో ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆయన ఆకర్షితుడయ్యారు. ‘ఆర్య సభ’ పేరిట ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు. హర్యానా రాజకీయాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1977లో ఆయన హర్యానా అసెంబ్లీకి ఎన్నికవడమే గాకుండా విద్యామంత్రిగా సేవలందించారు. హర్యానా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు తీసుకురావడంలో ఆయన ఎంతో చొరవ తీసుకున్నారు.
దేశంలో వెట్టిచాకిరి విముక్తి కోసం తీవ్రంగా కృషి చేశారు. బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ను స్థాపించి వెట్టిచాకిరి నిర్మూలన కోసం ఆయన సేవలను గుర్తించిన యునైటెడ్ నేషన్స్ వాలంటరీ ట్రస్ట్ ఫండ్ కాంటెంపరరీ ఫార్మ్స్ ఆఫ్ స్లేవరీ చైర్మన్ గా నియమించింది. 10 సంవత్సరాలు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మహిళల హక్కుల కోసం ఆయన దేశ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బ్రూణ హత్యలకు నిరసనగా ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎంతో కృషి చేశారు. అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతుకగా నిలుస్తూ అగ్నివేశ్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో కూడా ఆయన మధ్యవర్తిత్వం వహించారు. 2011లో మావోయిస్టు పార్టీ పోలీసులను అపహరించినపుడు కూడా వారిని విడుదల చేయడంలో స్వామి కీలక పాత్ర పోషించారు. 2013లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఉద్యమానికి మద్దతు తెలుపుతూ క్రీయాశీలకంగా వ్యవహరించారు.2018లో ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బీఫ్ కు మద్దతుగా ఆయన చేసిన కామెంట్స్ వారి కోపానికి కారణమైంది. ఈ దాడిలో అగ్నివేశ్ చొక్కాని చింపి కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడిలో ఆయన అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఆ దాడిలో ఆయనకు తీవ్రమైన గాయాలు తగిలాయి. అంతర్గత గాయాలు కూడా కావడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. వయోభారం కూడా తోడవడటంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి అధ్యక్షుడుగా వ్యహరించి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన మృతికి పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. మహోన్నత వ్యక్తిత్వం ఉన్న ఆ మహనీయుడికి లియో న్యూస్ తరుపున ఆశ్రు నివాళి…