తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నెల్లూరు టీడీపీలో కీలక నేత మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, ఆయన సతీమణి అనురాధ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను పార్టీ అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ చేశారు. టీడీపీ అధినేత కొత్తగా రాష్ట్ర కమిటీ వేశారు. గతంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న తాళ్లపాక అనురాధకు కొత్త కమిటీలో చోటు దక్కలేదు. దీంతో రమేష్ రెడ్డి, అనురాధ దంపతులు తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచీ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఎన్టీఆర్ కు సన్నిహితంగా ఉన్న రమేష్ రెడ్డి 1994లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేశారు. అయితే 1994 తరవాత రమేష్ రెడ్డికి పార్టీ టికెట్ దక్కలేదు. అయినా ఆయన టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నారు. తాజాగా ప్రకటించిన టీడీపీ రాష్ట్ర కమిటీ పదవుల్లో అనురాధకు, రమేష్ రెడ్డికి ఎలాంటి పదవి దక్కకపోవడంతో వారు పార్టీకి రాజీనామా సమర్పించారు.
కొనసాగుతున్న రాజీనామాల పరంపర
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో కీలక నేత, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంకట సత్యనారాయణస్వామి ఆలియాస్ సోంబాబు పార్టీకి రాజీనామా చేశారు. సోంబాబు రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ చేశారు. పార్టీ సభ్యత్వం పేరులో రూ.100 కోట్లు వసూలు చేసిన చంద్రబాబునాయుడు, కార్యకర్తలు చనిపోయినా కనీసం బీమా కూడా ఇప్పించలేదని సోంబాబు సంచలన ఆరోపణలు చేశారు.
బుజ్జగింపులు మొదలు..
పార్టీ పదవులు దక్కక అసంతృప్తికి లోనై రాజీనామాలకు పాల్పడుతున్న నేతలను టీడీపీ నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు. ఇంకా నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించాల్సి ఉంది. దీనికితోడు అనుబంధ సంఘాల పదవులు కూడా ప్రకటించలేదు. పదవులు రానివారు అసంతృప్తికి గురికావాల్సిన పనిలేదని అధిష్టానం భరోసా ఇస్తోంది. అయితే పార్టీలో 219 పదవులు భర్తీ చేసినప్పుడు ఇలాంటివి ఒకటీ అరా సహజమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.