అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో ట్రంప్కు తొలి దెబ్బ తగిలింది. తొలి ఫలితం వెలువడ్డ డిక్స్విల్లే నోచ్లో అధ్యక్షుడు ట్రంప్కు ఒక్క ఓటు కూడా పోల్ అవలేదు. ఇక్కడ పోలైన ఐదుకు ఐదు ఓట్లు డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఖాతాలోకే వెళ్లాయి. అమెరికా ఎన్నికల్లో ప్రతీసారి న్యూహాంప్షైర్ నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాధారణంగా అన్ని రాష్ట్రాల్లో ఉదయం పూట పోలింగ్ జరిగితే… ఈ ఈశాన్య రాష్ట్రంలో మాత్రం అర్ధరాత్రి నుంచే పోలింగ్కి అనుమతిస్తారు. గత 60ఏళ్లుగా ఇక్కడి ప్రజలు అర్ధరాత్రి నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
మిల్స్ఫీల్డ్లో ట్రంప్ సత్తా…
తొలి ఫలితం వెలువడ్డ డిక్స్విల్లేలో గత 2016 అధ్యక్ష ఎన్నికల్లోనూ డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఎలక్టోరల్ కాలేజ్ మాత్రం ట్రంప్ గెలుచుకోవడం గమనార్హం. డిక్స్విల్లేలో ఓట్లు రానప్పటికీ… అదే న్యూహాంప్షైర్లోని మిల్స్ఫీల్డ్లో ట్రంప్ సత్తా చాటారు. అక్కడ 16 ఓట్లు ట్రంప్కు పోల్ అవగా… కేవలం ఐదు ఓట్లు మాత్రమే బైడెన్కు పోల్ అయ్యాయి. ఇక ఇదే రాష్ట్రంలోని టౌన్ హార్ట్స్ లొకేషన్లో మాత్రం అర్ధరాత్రి ఓటింగ్ ఆనవాయితీని ఈసారి పక్కనపెట్టారు. కరోనా నేపథ్యంలో మిగతా రాష్ట్రాల మాదిరి గానే ఉదయం పూట తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా టైమింగ్స్…
అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ వేళలు ఒకేలా లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఉదయం 7గం. నుంచి రాత్రి 7గం. వరకు ఓటింగ్ జరగనుంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఉదయం 6గం. నుంచి సాయంత్రం 7గం. వరకు,ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉదయం 7.30గం. నుంచి రాత్రి 7.30గం. వరకు జరగనుంది.కొన్ని రాష్ట్రాల్లో ఉదయం 6గం. నుంచి రాత్రి 8గం. వరకు జరగనుంది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో… మాన్హట్టాన్ సహా పలు నగరాల్లో షాపులను మూసివేశారు.
తుది ఫలితం ఆలస్యమయ్యే సూచనలు…
కరోనా నేపథ్యంలో ఈసారి ఎక్కువమంది ఓటర్లు ముందస్తు ఓటింగ్ను వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అలాగే డెమోక్రాటిక్ పార్టీకి చెందిన చాలామంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. పోస్టల్ ద్వారా చేరే ఈ ఓట్ల లెక్కింపుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది…










