శ్రీకాకుళం – విజయనగరం సరిహద్దు ప్రాంతంలోని గిరిజన తండాల్లో నివసిస్తున్న గిరిజనులకు కరిరాజులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపుతో పరిసర గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వీటికి అడ్డుకట్టవేసేందుకు అటవీశాఖ సరైన ప్రయత్నాలు చేయకపోవడంతో స్థానికులకు నిత్యం నరకయాతన తప్పడం లేదు.
2007 నుండి ..
ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లోని ఉత్తరాంధ్ర ప్రాంత గిరిజన గ్రామాల్లో 2007నుండి కరిరాజుల అలజడి ప్రారంభమైంది. 2007లో ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి దారితప్పి ఉత్తరాంధ్ర జిల్లాలోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. అలా వచ్చిన వాటిలో ప్రస్తుతం 40 మిగిలున్నాయి.2010లో వీటి తరలింపునకు చేపట్టిన ‘ఆపరేషన్ గజ’లో రెండింటిని తరలించారు. అనంతరం రెండు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్ఛాపురం వద్ద అనుమానాస్పదంగా మృతి చెందాయి. మరో ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందింది. మరో ఏనుగు విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం వద్ద గోతిలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందింది. మిగిలిన 40 ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించడంలో సంబంధిత అధికారులు విఫలం అవుతుండటంతో అవి అడపాదడపా విజృంభిస్తున్నాయి.
15 మంది మృత్యువాత
ఈ ఏనుగుల వల్ల ఏజెన్సీ గిరిజన గ్రామాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు సుమారు 15 మంది మృత్యువాత పడ్డారు. 2008 నుంచి ఇప్పటివరకు సుమారు 500 ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. వీటితోపాటు ఉద్యానవన, చెరకు పంటలు నాశనమయ్యాయి.
ఆహారం కోసమే ..
అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయిన ఏనుగుల గుంపు ఆహారం కోసమే మైదాన ప్రాంతాలకు వచ్చేశాయి. వీటికి రోజుకు కనీసం మూడువేల లీటర్ల నీరు అవసరం. కొండలపై ఊట గెడ్డలు, చెరువులు అంతరించి పోతున్నాయి. అడవులు అక్రమంగా నరికివేస్తున్నారు. అందువల్ల ఏనుగులకు సరైన నీడ, నీరు, ఆహారం లభించడం లేదు. అందువల్ల అవి మైదానప్రాంతాల్లో తిష్ట వేస్తున్నాయి. వేరొక వైపు గిరిజనుల కొండలపై చేస్తున్న పోడు వ్యవసాయం రోజురోజుకూ విస్తరిస్తోంది. వరి, మొక్కజొన్న, అరటి, పనస, చెరకు వంటివి పండిస్తుండటంతో వీటి కోసం మైదాన ప్రాంతాలకు ఏనుగులు వస్తున్నాయి.
బిక్కుబిక్కుమంటూ ..
గజరాజుల బాధిత గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లబుస్తున్నారు. అదే తరుణంలో ఉపాధికీ దూరమవుతున్నారు. పనుల కోసం పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. 40 ఏనుగులు ఒక్కోసారి గుంపుగా దాడి చేసి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆ తరుణంలో ఎదురైన వారిపై అమాంతం దాడిచేసి పొట్టన పెట్టుకుంటున్నాయి.
కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు
ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరిన ఏనుగుల గుంపు నుంచి ప్రజల రక్షణకు అటవీశాఖ రూపొందించిన ప్రతిపాదనలు ఏళ్లతరబడి నానుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ఒడిశా నుంచి వచ్చిన గుంపును తిరిగి వాటి స్థానానికి చేర్చే యత్నంలో భాగంగా ఓ ఏనుగు మృత్యువాత పడడంతో ఒడిశా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. దీంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. మన రాష్ట్రంలోని జంతు ప్రదర్శనశాలకు వీటిని తరలించేందుకూ ప్రతిపాదించారు. అదీ ఫలితం ఇవ్వలేదు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో కందకాలు తవ్వడం ద్వారా సమీప మైదాన ప్రాంతాలకు చేరకుండా ఉండేందుకు చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీన్ని గిరిజనులు వ్యతిరేకించడంతో పనులు నిలిచిపోయాయి. అటవీశాఖ ఎలిఫేంట్ జోన్ను ప్రతిపాదించింది. కొంతమేర అటవీ ప్రాంతాన్ని ఎలిఫేంట్ కారిడార్గా ఏర్పాటు చేసేందుకు అప్పటి అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనా కార్యరూపం దాల్చలేదు. ఏనుగుల గుంపు పర్యవేక్షణ కష్టతరంగా మారిన నేపథ్యంలో గతంలో రాష్ట్ర ఉన్నతాధికారులు మరో కొత్త ప్రతిపాదన చేశారు. ఏనుగుల శరీరంలో ప్రత్యేకమైన చిప్ను అమర్చడం ద్వారా వాటి గమనాన్ని సులభంగా గుర్తించవచ్చన్న ప్రతిపాదనా అమలు కాలేదు.
ట్రాకర్ల పర్యవేక్షణలో
ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపును అటవీశాఖ ట్రాకర్ల పర్యవేక్షణలో ఉంచింది. 15 మంది ట్రాకర్లు నిత్యం ఏనుగుల కదలికలను గమనిస్తూ ఉన్నారు. ఏబీవోలు, ఎఫ్బీవోలూ గుంపు కదలికలను పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఏనుగులు అత్యంత తెలివిగా తమ పని తాము చేస్తున్నాయి. అర్థరాత్రి వేళ, అపరాన్న వేళ దాడి చేస్తున్నాయి.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి స్వయాన ఈ ప్రాంత ప్రతినిధి అయినందున ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.