మాజీ మంత్రి ఈటల రాజేందర్తో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి భేటీ అయ్యారు.శామీర్పేట్లోని ఈటల నివాసానికి వచ్చి కొండా విశ్వేశ్వర్రెడ్డి మాజీ మంత్రి ఈటలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ భేటీలో ఏం జరిగిందనే విషయానికి వస్తే ప్రధానంగా టార్గెట్ కేసీఆర్ అంశమే ప్రధానంగా కనిపిస్తోంది.గతంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ కేసీఆర్ను గద్దె దింపేందుకు, తెలంగాణ పురోగతికి ఉపయోగపడే ఏ వేదికతోనైనా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు.కేసీఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడే ఏ వ్యక్తితోనైనా, ఏ పార్టీ అయినా సరే కలుస్తామని వ్యాఖ్యానించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసి రెండో స్థానంలో నిలిచిన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్)తోనూ కొండా భేటీ అయ్యారు.
కొత్త పార్టీపై చర్చ జరిగిందా..
ఈటల-కొండా విశ్వేశ్వర్రెడ్డి భేటీలో ప్రధానంగా కొత్త పార్టీపై చర్చ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.అదే సమయంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి సన్నిహితులు మాట్లాడుతూ కొత్త పార్టీ అంశం కంటే కేసీఆర్పై ఈటల పోరాటం ఎలా ఉండబోతోంది..అందుకు సానుకూల, ప్రతికూల అంశాలు ఏంటనే చర్చ నడిచిందని చెబుతున్నారు.కొత్త పార్టీ పెట్టడం అనేది తరువాతి అంశమని, కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఏకీకరణ ప్రధాన అజెండాగా చర్చ నడిచినట్టు తెలుస్తోంది.ఈ చర్చలో భాగంగా రేవంత్రెడ్డి, కోదండరాం,తీన్మార్ మల్లన్న,కాంగ్రెస్ పార్టీలో రానున్న కాలంలో జరగనున్న మార్పులు,ఉద్యమకారుల పరిస్థితి అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఉద్యమకారులైన గాదె ఇన్నయ్య,చెరకు సుధాకర్,కోదండరాం,జిట్టా లాంటివారి విషయంలో కేసీఆర్ వ్యవహారశైలి,ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
తక్షణ నిర్ణయాలు ఇవీ..
కాగా పార్టీ తీసుకునే నిర్ణయాలను బట్టి తన కార్యాచరణ ఉంటుందని ఈటల చెప్పినట్లు సమాచారం.ఒక వేళ పార్టీ నుంచి బయటకు వెళ్లినా,పార్టీ నుంచి బలవంతంగా బయటకు పంపించినా హుజూరాబాద్లో తన పట్టు నిరూపించుకున్నాకే రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ ఉంటుందని ఈటల వర్గం చెబుతోంది.అదే సమయంలో టీఆర్ఎస్ వ్యూహాలు కూడా కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఈటలకు వ్యతిరేకంగా మంత్రులు కొప్పుల, గంగుల వ్యాఖ్యానించారు. మరికొందరు నాయకులు కూడా ఈటలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.ఇదే అంశం కొండా విశ్వేశ్వర్ రెడ్డితో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం.
సీన్లోకి బోయినపల్లి పేరు..
ఇక ఒకవేళ ఉప ఎన్నిక వస్తే రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు,కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను రంగంలోకి దింపే ఆలోచన కూడా పార్టీకి ఉన్నట్లు చర్చ నడుస్తోంది.ఇందుకు కారణం కూడా ఉంది.ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం గతంలో కమలాపూర్ నియోజకవర్గంగా ఉండేది.నియోజకవర్గాల పునర్విభజన తరవాత హుజూరాబాద్గా మారింది.అయితే కమలాపూర్ నియోజకవర్గం గతంలో హన్మకొండ లోక్సభ పరిధిలో ఉండేది. గతంలో వినోద్కుమార్ హన్మకొండ ఎంపీగా గెలిచారు.కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్గా మారాక 2014లో కరీంనగర్ నుంచి పోటీచేసి గెలిచారు వినోద్కుమార్.నియోజకవర్గంలో పరిచయాలు,కేసీఆర్ కుటుంబాలకు బంధుత్వాలు,ఈటల వ్యతిరేక వర్గం కలసి వస్తాయనే కోణంలో పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఆచితూచి నిర్ణయాలు..
తన కార్యాచరణ విషయంలో ఈటల ఆచితూచి వ్యాఖ్యానిస్తున్నారని ఆయన వర్గం చెబుతోంది.ఓవైపు నిఘా వర్గాలతో పాటు పార్టీ కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తోందనే చర్చ నడుస్తోంది.ఈటలకు సపోర్టుగా మాట్లాడినా,పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఆ సమాచారం వెంటనే పార్టీ కార్యాలయానికి తెలుస్తోందనే అభిప్రాయం కూడా ఉంది.ఈ నేపథ్యంలోనే ఈటల తన కార్యాచరణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం.ఈటల విషయంలో పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తే ఈటలకు సానుభూతి మరింత పెరుగుతుందన్న ఉద్దేశం కూడా పార్టీకి ఉందనే చర్చ నడుస్తోంది.
ఈటల అనుచరుడికి నోటీసులు..
ప్రస్తుతం తెలంగాణలో ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించడమే చర్చనీయాశంగా ఉంది.ఈటలకు మద్దతుగా ఎవరు నిలిచినా ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కూడా వస్తున్నట్లు ఈటల వర్గం భావిస్తోంది.ఈటల అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవరెడ్డికి కెడీసీసీ బ్యాంకు తాజాగా నోటీసులు పంపడమే ఇందుకు నిదర్శనమని ఈటల వర్గం చెబుతోంది.గతంలో సాదవరెడ్డి కేడీసీసీ బ్యాంకు పాలకవర్గంలో ఉన్న సమయంలో రూ.18 లక్షల అవినీతి జరిగిందని గురువారం బ్యాంకు నోటీసులు పంపింది.దీంతో ఈటల వర్గం ఆచితూచి వ్యవహరిస్తోంది.











