(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన సమాచార సేకరణకు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఇందుకు సంబంధించి మొదటి సారిగా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా నేతృత్వంలో అధికారిక సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అడిగే సమాచారం కోసం అన్ని వివరాలను వివిధ శాఖలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
లోక్ సభ నియోజకవర్గాల పరిధి ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. తర్వాత వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉప కమిటీలు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు అయ్యాయి. దీనికి కొనసాగింపుగా జిల్లాస్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో సహాయ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ఇందులో భాగంగానే కలెక్టర్ అధ్యక్షతన చిత్తూరులో అధికారిక సమావేశం జరిగింది. జిల్లాలో 66 మండలాలు ఉండగా మదనపల్లె, చిత్తూరు, తిరుపతి రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మదనపల్లె డివిజన్లో 31 మండలాలు, చిత్తూరులో 20, తిరుపతిలో 15 మండలాలు ఉన్నాయి. భౌగోళికంగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. దీనిని రెండు డివిజన్లుగా చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతుండటంతో ఆ ప్రాంత వాసుల కల నెరవేరనుంది.
జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 3 లోక్సభ నియోజక వర్గాల పరిధిలోకి వస్తున్నాయి.చిత్తూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలు 3 రెవెన్యూ డివిజన్లలో ఉండడం గమనార్హం. ఇక రాజంపేట నియోజకవర్గం పరిధిలో జిల్లాకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. తిరుపతి పరిధిలో జిల్లాలోని నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాలు కలిసి ఉన్నాయి.దీంతో లోక్సభ నియోజకవర్గాలు పరిధిగా జిల్లాలు ఏర్పాటు కావాలంటే ముందుగా రెవెన్యూ డివిజన్ల హద్దులను మార్చాల్సి ఉంటుంది.
ఇందుకోసం రెవెన్యూ డివిజన్ల వారీగా అన్ని వివరాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్ల వారీగా వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, భవనాలు, ఖాళీ పోస్టుల వివరాలు, ఉద్యోగుల స్థానికత తదితర వివరాలను సేకరించి నివేదికలను సిద్ధం చేయనున్నారు.దీంతో క్షేత్రస్థాయిలో జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు మొదలైందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణన జరుగుతుంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏప్రిల్ లో కార్యక్రమాలు మొదలవుతాయి. ఈలోగా ఈ ఏడాది ఇప్పటికే ఇంటి గణన జరగాల్సి ఉంది. జనాభా గణన పూర్తి అయ్యేవరకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా హద్దులను మార్చేందుకు వీలులేదు. దీనిపై గత జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల అయింది. కరోనా కారణంగా ఇంటి గణన మొదలు కాలేదు.
వచ్చే ఏడాదిలోనే జన గణన ప్రారంభమవుతుంది. ఇందుకు ఆరు నెలల వ్యవధి పడుతుంది. ఆ తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా కేంద్రం అలాగే కొనసాగుతుండగా తిరుపతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంది. కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు నియోజక వర్గాలు వస్తాయి. చిత్తూరు జిల్లా పరిధిలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నందున మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం అవుతున్నాయి. మదనపల్లె జిల్లా కేంద్రం అవుతుందో లేదో చూడాలి.











