గుంటూరు కేంద్రంగా నకిలీ నోట్ల తయారీ ముఠాలు విజృంభిస్తున్నాయి. తాజాగా గుంటూరు బైపాస్ ఏటుకూరు సమీపంలో రూ.2 కోట్ల నకిలీ నోట్లను పోలీసులు గుర్తించారు. ఓ సంచిలో రోడ్డు పక్కన పడి ఉన్న రూ.2 కోట్ల నకిలీ నోట్లను గుంటూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కలర్ జిరాక్స్ తీయడం ద్వారా ఈ నకిలీ నోట్లను తయారు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గత వారం గుంటూరు సమీపంలోని మేడికొండూరులో నకిలీనోట్లు ముద్రించి చలామణీ చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా గుంటూరు నగర సమీపంలో లభ్యమైన నకిలీ నోట్లు కూడా ఆ ముఠాసభ్యుల పనే అయి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నకిలీ నోట్ల అడ్డాగా గుంటూరు
నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి గుంటూరు కేంద్రంగా మారింది. గుంటూరు నగర సమీపంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. అందులో కొన్ని మూతపడి, కేవలం షెడ్డులాగా మాత్రమే ఉన్నాయి.అలాంటి వాటిని లీజుకు తీసుకుని, యజమానికి కూడా తెలియకుండా ప్రింటర్లు ఏర్పాటు చేసుకుని నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల కిందట గుంటూరు సమీపంలో నకిలీ కరెన్సీ మారుస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఓ ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా మరికొంత మంది చిక్కే అవకాశం ఉంది.
చిరువ్యాపారులే లక్ష్యం..
గుంటూరు కేంద్రంగా ముద్రిస్తున్న నకిలీ కరెన్సీని, చిరు వ్యాపారుల వద్ద రాత్రి వేళల్లో ఏవైనా ఒక వస్తువు కొని నకిలీ నోట్లు ఇస్తున్నారు. అలా నకిలీ నోట్లను చలామణీలోకి తీసుకువస్తున్నారు. అవి బ్యాంకులకు చేరగానే నకిలీవని పక్కన పడేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓ జాతీయ బ్యాంకులో తరచూ నకిలీ నోట్లు రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారని తెలుస్తోంది. ఈ సమాచారంతో పక్కానిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఒక ముఠాను పట్టుకోగలిగారు.
సామాన్యులే బలి
నకిలీ నోట్ల వ్యవహారంలో సామాన్యులు బలైపోతున్నారు. చిరు వ్యాపారం చేసేవారు నకిలీ నోట్లను గుర్తించలేకపోతున్నారు. తరవాత బ్యాంకులో డిపాజిట్ చేసే సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకటి రెండు నోట్ల అయితే పరవాలేదు. ఎక్కువ సంఖ్యలో నకిలీ కరెన్సీ పట్టుపడితే మాత్రం బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. ఇక పోలీసులు చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలా సామాన్యులు కేసుల్లో ఇరుక్కుని బలైపోతున్నారు. నకిలీ కరెన్సీ ముద్రణ ఎక్కడ జరుగుతుందో పోలీసులు నిఘావేసి పట్టుకుంటే సామాన్యులకు తిప్పలు తప్పుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.